మైలవరంలో మారుతున్న రాజకీయం
విజయవాడ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన మైలవరంలో ఇప్పుడు రాజకీయం రూటు మార్చుకోనుందా..? లోకల్ గా అక్కడ ఉండే నాయకుడు కావాలి అనే పబ్లిక్ డిమాండ్ తో జనసేన బలం పుంజుకొనుందా? అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ జనసేన అభ్యర్థి గెలిచేనా? అక్కడ జనసేనకు ఉన్న బలం, బలహీనతలు ఏంటి?ఏపీ రాజకీయాల్లో చాలా రోజులుగా మైలవరం నియోజకవర్గం హాట్ టాపిక్గానే ఉంటోంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేశ్లకు మధ్య ఇంటర్నల్గా అస్సలు పొసగడం లేదనే ముచ్చట జోరుగా వినిపిస్తోంది. పొలిటికల్గా ఇదో సంగతయితే… ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అనే వ్యవహారం అధికార వైసీపీతో పాటు… ప్రతిపక్షంలోని టీడీపీకి నష్టం కలిగించేలా మారింది. గత మూడు పర్యాయాల నుంచి మైలవరంలో నాన్ లోకల్సే గెలిచారు మరి. గతంలో టీడీపీ తరపున గెలిచి దేవినేని ఉమ.. 2019లో వైసీపీ అభ్యర్థిగా గెలిచిన వసంత కృష్ణ ప్రసాద్లిద్దరూ నందిగామ నుంచి వచ్చినవాళ్లే. ఇలా.. వేరే ప్రాంతంవాళ్లు తమపై పెత్తనం చేయడం.. స్థానికులకు అస్సలు నచ్చట్లేదని తెలుస్తోంది.ఎలక్షన్ హీట్ పెరగడంతో, స్థానికత వివాదం వైసీపీ, టీడీపీల మధ్య చినికిచినికి గాలివానగా మారింది. ఇదే అస్త్రాన్ని తనకి అనుకూలంగా మార్చుకుంటున్నారట మైలవరంలో జనసేన అభ్యర్ధి అక్కల రామ్మోహన్ రావు.
అక్కల గాంధీగా లోకల్స్కి సుపరిచితుడైన రామ్మోహన్… ప్రత్యర్థులకు ధీటుగా అందరితో కలిసిపోయి పని చేసుకుంటున్నారట. స్థానికత్వం ఈయనకు అదనపు బలం అయ్యే అవకాశం లేకపోలేదు. 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 2019 వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన రామ్మోహన్రావు… గత ఎన్నికల్లో జననేత అభ్యర్థిగా పోటీచేసి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే, చాలా ప్రాంతాల్లో ఓట్లు చీలడంతోనే.. గెలుపోటములు తారుమారయ్యాయనే అభిప్రాయం కూడా ఉంది.రాబోయే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నుంచి మైలవరంలో.. పోటీచేయబోయే ఇద్దరు నేతలూ నాన్ లోకల్స్. ఇప్పుడు అదే అస్త్రాన్ని వాడనున్నారు అక్కల గాంధీ . నాన్ లోకల్స్ అంతా.. ఇసుక, గ్రావెల్,బూడిద అక్రమ మైనింగ్ చేస్తున్నారనీ.. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ,వైసీపీ నాయకులు నెగ్గినా జరిగిన అభివృద్ధి మాత్రం శూన్యమనీ…
జనసేన తరఫున ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అదెంతో కొంత పనిచేసే అవకాశం లేకపోలేదన్నది విశ్లేషకుల మాట.మైలవరం నియోజకర్గంలో 8 మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉంది. 5 లక్షల జనభా ఉండగా.. దాదాపు 3 లక్షలమంది కమ్మ ,కాపులే ఉన్నారు. బీసీ, ఎస్సీలు 2 లక్షల వరకు ఉంటారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని చెప్తున్న జనసేన… టిడిపితో కలిసివెళ్తే మాత్రం సీటు ఎవరికి దక్కుతుందనేదే తేలాల్సి ఉంది. పొత్తులో టిడిపికి టికెట్ కేటాయిస్తే జనసేన కార్యకర్తలు సపోర్ట్ చేస్తారా? అన్నది ఫుల్లుగా డౌట్ఫుల్లే. పోనీ జనసేనకే టికెట్ ఇస్తే.. కమ్మవారికి కంచుకోటగా ఉన్న కొండపల్లి ఖిల్లా ప్రజలు.. ఆదరిస్తారా? అనేదీ అనుమానమే. ఇంతకీ, జనసేన రూటు ఎటు.. ఎన్నికలనాటికి ఎవరు ఎటువైపు నిలుస్తారన్నదే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
Tags: Changing politics in Mylavaram