Natyam ad

వివాదమౌతున్న ఎస్పీ  వ్యవహారం

నెల్లూరు ముచ్చట్లు:
 
మ‌హిళా పోలీసుల‌కు పురుష టైల‌ర్స్ కొల‌త‌లు తీసిన ఘ‌ట‌న ఏపీలో తీవ్ర కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ చేసింది. ఆ ఫోటోలు, వీడియోలు వైర‌ల్‌గా మార‌డంతో.. అప్ప‌టిక‌ప్పుడు మ‌గ ద‌ర్జీల ప్లేస్‌లో లేడీస్ టైల‌ర్స్‌ను తీసుకొచ్చి ప‌నిపూర్తి చేశారు. అయితే, ఈ ఎపిసోడ్‌లో నెల్లూరు జిల్లా పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరు మ‌రంతి క‌ల‌క‌లం రేపుతోంది. మ‌హిళా పోలీసుల కొల‌త‌లు తీస్తున్న ఫోటోలు తీసిన వ్య‌క్తిపై కేసు పెట్ట‌డంతో మ‌రో వివాదం చెల‌రేగింది. నిషిద్ధ ప్రాంతంలోకి చొర‌బ‌డి.. అనుమ‌తి లేకుండా ఫోటోలు తీశారంటూ కొంద‌రిపై కేసు న‌మోదు చేశారు నెల్లూరు పోలీసులు. మ‌గ ద‌ర్జీల‌తో ఆడ పోలీసుల కొల‌త‌లు తీయిస్తే త‌ప్పులేదుగానీ.. ఆ త‌ప్పును త‌ప్పుగా చూపించే ప్ర‌య‌త్నం చేసిన వారిపై కేసులు పెట్ట‌డం దుమారం రేపుతోంది. జిల్లా ఎస్పీ విజ‌యారావు ఆదేశాల మేర‌కే ఇలా కేసు పెట్టారని అంటున్నారు. ఆ త‌ర్వాత ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ.. ఘ‌ట‌న‌లో త‌మ త‌ప్పిదం ఏమీ లేద‌న్న‌ట్టు క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. నెల్లూరు ఎస్పీ విజ‌యారావు వ్య‌వ‌హార‌శైలిపై సోష‌ల్ మీడియాలో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గ‌తంలోనూ విజ‌యారావు అమ‌రావ‌తిలోనూ ఇలాంటి బెదిరింపు కేసుల‌తో భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేశారంటూ గుర్తు చేస్తున్నారు. రెండేళ్ల కిందట రాజధాని ప్రాంతమైన మందడం ప్రభుత్వ ఉన్నత పాఠశాల గదుల్ని పోలీసుల బసకు కేటాయించటంతో..
 
 
 
విధిలేని పరిస్థితుల్లో టీచ‌ర్లు విద్యార్థులకు ఆరుబయట పాఠాలు చెప్పాల్సి వ‌చ్చింది. ఈ దృశ్యాల్ని కవర్‌ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై 2020 జనవరి 23న గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. తాను దుస్తులు మార్చుకుంటుండగా.. మీడియా ప్రతినిధులు వీడియో తీశారంటూ శిక్షణలో ఉన్న మహిళా కానిస్టేబుల్‌తో తప్పుడు ఫిర్యాదు చేయించార‌ని అన్నారు. ఐపీసీ 448, 354(సీ), 509 రెడ్‌విత్‌ 34, ఎస్సీ, ఎస్టీలపై దాడుల నిరోధక చట్టం తదితర సెక్షన్ల కింద.. మీడియా ప్ర‌తినిధుల‌పై స్ట్రాంగ్‌ కేసులు పెట్టారు పోలీసులు. అప్పుడు ఇదే విజ‌యారావు గుంటూరు రూర‌ల్ ఎస్పీగా ఉన్నారు. ఆయ‌న ఆదేశాల మేర‌కే పోలీసులు అలా త‌ప్పుడు కేసులు పెట్టార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆ విష‌యం కోర్టుకు కూడా వెళ్లింది.మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా రాజధాని గ్రామాల ప్రజల పోరాటాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నందున ఉన్నతాధికారుల ఆదేశాలతో తప్పుడు ఫిర్యాదుతో తమపై కేసు నమోదు చేశారని అప్పట్లో మీడియా ప్రతినిధులు కోర్టుకు తెలిపారు. స్పందించిన హైకోర్టు మీడియా ప్రతినిధులపై ఎస్సీ, ఎస్టీ దాడుల నిరోధక చట్టం కింద నమోదు చేసిన సెక్షన్లను తొలగించాలని ఆదేశించింది. ఫిర్యాదుదారు ఎస్సీ అనే విషయం మీడియా వారికి ఎలా తెలుస్తుందని పోలీసుల్ని ప్రశ్నించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు విజయారావును రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ రైల్వే ఎస్పీగా బదిలీ చేసింది. గతేడాది జులైలో నెల్లూరు ఎస్పీగా ట్రాన్స్‌ఫ‌ర్ చేసింది. ఇప్పుడు ఆయ‌న డైరెక్ష‌న్‌లోనే గ‌తంలో అమ‌రావ‌తిలో మీడియా వారిపై కేసులు పెట్టిన‌ట్టుగానే.. మ‌హిళా పోలీసుల కొల‌త‌ల‌ను మ‌గ ద‌ర్జీలు తీస్తుండ‌గా ఫోటోలు తీశారంటూ కొంద‌రిపై కేసు పెట్ట‌డం మ‌రోసారి వివాదాస్ప‌దంగా మారింది. ఎస్పీ విజ‌యారావుపై సోష‌ల్ మీడియాలో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
 
Tags; Controversial SP affair