ఏప్రిల్ 10 నుండి 18వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు.
-బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన జెఈవో వీరబ్రహ్మం
తిరుపతి ముచ్చట్లు:
ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, స్థల పరిశీలన, కల్యాణవేదిక వద్ద జరుగుతున్న పలు అభివృద్ధి పనులను జెఈవో వీరబ్రహ్మం బుధవారం పరిశీలించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇంజినీరింగ్, ఆలయ అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 10 నుండి 18వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 15వ తేదీ రాత్రి 8 నుండి 10 గంటల వరకు సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 19న పుష్పయాగం జరుగతుందన్నారు. ఇందుకోసం చేపట్టవలసిన ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వేలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్య నిర్వహణ, షెడ్లు, తాగునీరు, అన్నప్రసాదాలపై పంపిణీపై అధికారులతో చర్చించినట్లు తెలిపారు. కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనలును త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం సివిఎస్వో గోపినాథ్ జెట్టి మాట్లాడుతూ స్వామివారి కల్యాణానికి వేలాదిగా వచ్చే భక్తులకు భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని టిటిడి విజిలెన్స్, పోలీస్ విభాగం వారితో సమన్వయం చేసుకొని పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. దర్శనం, అన్నప్రసాదాల పంపిణీ వద్ద తోపులాట లేకుండా బ్యారీకేడ్లు, కల్యాణానికి వచ్చే భక్తులకు పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు.
అంతకుముందు జెఈవో, సివిఎస్వోతో కలిసి శ్రీ కోదండరామాలయం, ఆలయ పరిసరాలు, కల్యాణ వేదిక పరిశీలించి పలు సూచనలు చేశారు.