Natyam ad

కేసీఆర్ పై ఆప్ ఆరోపణలు

న్యూఢిల్లీ ముచ్చట్లు:
 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’ ఢిల్లీ వెళ్ళింది ఎందుకు? కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేసేందుకు, అని కదా అనుకుంటున్నాం. కానీ, అసలు కారణం అది కాదు, అంటున్నారు  ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమనాథ్ భారతి. అదేమిటి, కేసీఆర్ ఢిల్లీ వెళ్ళిందే ఆప్’ అధ్యక్షడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో భేటీ కోసం కదా, అలా అనే కదా, ప్రచారం జరిగింది, అంటారా? నిజమే, కానీ, కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఐదు రోజులు అయినా, ఇంతవరకు ఢిల్లీ ముఖ్యమంత్రిని కలవ లేదు. అసలు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోనే లేరని తెలుస్తోంది. అంతే కాదు, కేసీఆర్’ ను కలవడం ఇష్టం లేకనే, కేజ్రీవాల్ బెంగుళూరు వెళ్ళారని అపట్లోనే గుసగుసలు వినిపించాయి. అదలా ఉంటే, ఇప్పుడు ఉన్నట్లుండి ఆమ్ ఆద్మీ పార్టీ నేత, కేజ్రీవాల్’కు అత్యంత సన్నిహితంగా ఉండే  ఎమ్మెల్యే  సోమనాథ్ భారతి కేసీఆర్ ఢిల్లీ యాత్రకు సంబంధించి కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. కేసీఆర్ ఢిల్లీకి వచ్చింది రాజకీయ చర్చల కోసం కాదు, అవినీతి లోతుల్లోంచి బయట పడేందుకు, న్యాయ నిపుణులతో సంప్రదింపుల కోసం కేసీఆర్ ఢిల్లీ వచ్చారని సోమనాథ్ భారతి, కొత్త చర్చను తెర మీదకు తెచ్చారు. అంతే కాదు, ఆయన కేసీఆర్’పై తీవ్ర ఆరోపణలు చేరారు. అవినీతిలో కేసీఆర్ పీహెచ్‌డీ చేశారని దుయ్యబట్టారు. ఆవినీతి కేసుల నుంచి బయట పడేందుకే, కేసీఆర్ బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామిని, సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్‌’ను కలిశారని, సోమనాథ్ స్పష్టమైన ఆరోపణ చేశారు. అంతేకాకుండా, ఇంతవరకు మరే ఇతర ప్రాంతీయ పార్టీ నాయకుడు చేయని రీతిలో ఆప్ నేత కేసీఆర్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమకారులను, యువతను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. “దళితుల ఓట్లతో కేసీఆర్ సీఎం అయ్యారు. దళిత సీఎం, మూడెకరాల భూమి ఇస్తామని కేసీఆర్‌ మోసం చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో అవినీతి ఉంది.
 
 
 
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి ఖాయం. దేశంలోని ప్రతి పార్టీ ఒక వ్యక్తిగత ఎజెండాతో ఉన్నాయి. ప్రధాని మోడీకి వ్యతిరేకమైన ఫ్రంట్ దేశంలో అవసరం లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రజలకు మంచి చేసే ఫ్రంట్ కావాలి. కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోయారు” అని ఆప్ నేత దుయ్య పట్టారు. అయితే సోమనాథ్ ఈ విషయాన్ని ఇప్పుడు బయట పెట్టినపటికీ, నిజానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ముందుగా కేసీఆర్’ ను కలవక పోవడానికి కూడా అదే కారణమని, ఢిల్లీ రాజకీయ వర్గాల్లో కొద్ది రోజులుగా తెరచాటు చర్చ జరుగుతోంది. నిజానికి తెలుగు వన్’ అందరికంటే ముందే ఈ గుట్టును బయట పెట్టింది. ఉభయ తెలుగు తెలుగు రాష్ట్రాలకు చెందిన, ఒక సీనియర్’ నేత, కీసీఆర్ అవినీతి భాగోతం గురించి, కేజ్రీవాల్’ కు ముందుగానే ఉప్పందించారు. కేసీఆర్ ఢిల్లీ వస్తోంది కూడా, అవినీతి కేసుల్లోంచి బయట పడేందుకే అని సవివరంగా వివరించారు. కేసీఅర్’తో కలిస్తే కొరివితో తలగోక్కోవడమే అవుతుందని, ఆ ఏపీ ముఖ్య నేత  అందించిన సమాచారం కారణంగానే కేజ్రీవాల్ కేసీఆర్’ ను ఉద్దేసపూర్వకంగానే దూరంగా ఉంచారని, తెలుగు వన్,, ముందే చెప్పింది. ఇప్పుడు సోమనాథ్ ప్రకటనతో అదే నిజమని రుజువైంది. దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ నేత సోమనాథ్  భారతి ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ   కేసీఆర్’పై తీవ్ర్ విమర్శలు చేయడం రాజకీయ సంచలనంగా మారింది. ఓ వంక కేసీఆర్ అవినీతి చిట్టా బయటకు తీస్తున్నామని, రాష్ట్ర, కేంద్ర బీజేపీ నాయకులు ప్రకటనలు చేస్తున్న నేపధ్యంలో, కేసీఆర్ ఢిల్లీ వెళ్లి న్యాయనిపుణులతో సంప్రదింపులు జరపడం అనుమానాలకు తావిచ్చేలా ఉందని, అంటున్నారు. అంతే కాదు, బీజేపీ నాయకులు అన్నంత పని ( కేసీఆర్ అరెస్ట్ ) చేస్తారా, అనే చర్చ కూడా  అక్కడక్కడ వినవస్తోంది.
 
Tags: Op allegations against KCR