Natyam ad

విద్యాశాఖపై సీఎం  వైయస్.జగన్ సమీక్ష..

అమరావతి ముచ్చట్లు:
విద్యాశాఖపై సీఎం  వైయస్.జగన్ మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. నూతన విద్యావిధానం కింద తీసుకున్న నిర్ణయాలపై  సమీక్ష జరిగింది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఆరు కేటిగిరీల కింద స్కూళ్ల ఏర్పాటు – మ్యాపింగ్, సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు, ఇంగ్లిషు బోధన, డిజిటల్ లెర్నింగ్, మండలానికి రెండు జూనియర్ కళాశాలల ఏర్పాటు తదితర అంశాలపై అయన  సమీక్షించారు. విద్యాశాఖలో తీసుకున్న నిర్ణయాలు వాటి అమలు తీరును సీఎంకు వివరించిన అధికారులు, – నూతన విద్యావిధానానికి అనుగుణంగా ఇప్పటివరకు మ్యాపింగ్ కాకుండా మిగిలిన స్కూళ్లను కూడా మ్యాపింగ్ చేశామని వివరించారు.  ఫిబ్రవరి 14 నుంచి ప్రతిరోజూ ఒక ఇంగ్లిషు పదాన్ని నేర్పేలా విద్యార్థులకు బోధన,  వచ్చే ఏడాది 8వ తరగతి నుంచి డిజిటల్ లెర్నింగ్,  ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాన్ని పెంచేలా తగిన చర్యలు వుంటాయని వారు తెలిపారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ  ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నత చదువులు చదువుకున్న  టీచర్లు ఉన్నారు. వారి సేవలను సమర్థవంతంగా వాడుకోగలిగితే… నాణ్యమైన విద్య అందుతుంది.  అందుకనే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చాం.  మంచి చదువులు చదువుకున్న టీచర్ల సేవలను వాడుకునేందుకు విధానాలు రూపొందించాం.  సబ్జెక్టుల వారీగా టీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాం.  టీచర్ల సేవలను బోధనేతర కార్యక్రమాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ వాడుకోకూడదు.  దీనివల్ల విద్యార్థుల చదువులు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.  టీచర్లు పూర్తిగా విద్యార్థుల చదువులకు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు.  దీంట్లో భాగంగానే బోధనేతర కార్యక్రమాల్లో వారిని వినియోగించకుండా చూడాలి.  ప్రతిరోజూ ఒక పదాన్ని నేర్పేటప్పుడు డిక్షనరీలో దాన్ని చూసి అర్థం తెలుసుకోవడంతో పాటు, వాక్యంలో ఎలా ఉపయోగించాలో కూడా నేర్పాలి.  మొదటిరోజు పదం చెప్పడం, అసైన్మెంట్ ఇచ్చి రెండో రోజు దాన్ని ఉపయోగించడం నేర్పించాలని అన్నారు.
కొత్తగా ఏర్పడనున్న 26 జిల్లాల్లో కూడా ఉపాధ్యాయశిక్షణ కేంద్రాలు ఉండాలి.  ప్రస్తుతం ఉన్న శిక్షణా కేంద్రాలలో నాడు – నేడు కింద సౌకర్యాలను మెరుగుపరచాలి.  స్కూళ్లలో హెడ్ మాస్టర్లు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి. విద్యార్థులకు కెరీర్గైడెన్స్ ఇవ్వాలి.  తల్లిదండ్రులతో మంచి సంబం«ధాలు నెరుపుతూ విద్యార్థుల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసేలా హెడ్మాస్టర్లు ఉండాలి.  ప్రతి విద్యార్థినీ, వారి తల్లిదండ్రులనూ విడివిడిగా కలుస్తూ… వారి భవిష్యత్తుకు మంచి మార్గం వేసేలా కౌన్సిలింగ్ ఇవ్వాలని సీఎం అన్నారు.
 
Tags:Review by CM YS Jagan on Education