Natyam ad

విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద తిరుపతి వేంకటేశ్వరుడి విగ్రహం ఏర్పాటు

విశాఖపట్టణం ముచ్చట్లు:
 
ప్రపంచంలోనే అతిపెద్ద తిరుపతి వేంకటేశ్వరుడి విగ్రహం విశాఖలో ఏర్పాటు కాబోతోంది. దీనికి టీటీడీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది. ఇక ఈ విగ్రహం ఏర్పాటుతో విశాఖ ఆధ్యాత్మికపరంగా చరిత్ర సృష్టించే అవకాశాలు మెండుగా ఉంటాయి.తిరుమల వేంకటేశ్వరుడిని తిరుపతి వెళ్లి చూడాల్సిన అవసరం లేదు. ఇక విశాఖ వాసులకు ఆ కోరిక తీరబోతోంది. 125 అడుగుల ఎత్తులో చూసి ఆనందించే భాగ్యం విశాఖ వాసులకు కలుగబోతోంది. అంతేకాదు విశాఖకు ఇక మీదట వెంకన్న స్వామి కోసమే వచ్చి పర్యాటకులకు కూడా ఈ భారీ విగ్రహం కనువిందు చేయనుంది. దీనికి సంబంధించి శ్రీ వేంకటేశ్వరస్వామి ట్రస్ట్ స్వామి వారి నిలువెత్తు విగ్రహాన్ని స్తాపించేందుకు ముందుకు వచ్చింది.ఈ ట్రస్ట్ అధినేత రామకృష్ణంరాజు అతిపెద్ద వెంకన్న స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న తన కోరికను ఇలా తీర్చుకుంటున్నారు. ఆయన దీని మీద టీటీడీ ట్రస్ట్ ను ఇప్పటికే సంప్రదించారు. స్వామి వారి విగ్రహ ఏర్పాటుకు అనుమతించాలని.. సహకరించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఆయన లేఖ రాశారు.  దానికి వైవీ సుబ్బారెడ్డి అంగీకరించడమే కాకుండా  టీటీడీ తన వంతుగా పూర్తి సాయం చేస్తుందని కూడా పేర్కొన్నారు.ఇక విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జునను ఈ విషయమై టీటీడీ లేఖ రాసింది. మూడు ఎకరాల సువిశాల స్థలం 125 అడుగుల విగ్రహం ఏర్పాటుకు ఉచితంగా ఇవ్వాలని టీటీడీ కోరింది. భారీ ఖర్చుతో ఏర్పాటు చేయనున్న ఈ విగ్రహంతోపాటు ఆ సమీపాన స్వామి వారి ఆలయాన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు.ఈ భారీ విగ్రహాన్ని భీమిలి దగ్గర కాపులప్పాడలో అనువైన స్థలాన్ని గుర్తించారు. ఇక ప్రపంచంలో ఇప్పటిదాకా అతిపెద్ద వేంకటేశ్వర స్వామి వారి విగ్రహం 108 అడుగుల ఎత్తున మారిషస్ లో నిర్మించారు.  ఇప్పుడు దాన్ని మించి విశాఖలో ఏర్పాటు కానుంది. మొత్తానికి చూస్తే విశాఖ ఇప్పుడు అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుంది.
 
Tags: The world’s largest statue of Tirupati Venkateswara was erected at Visakhapatnam