తిరుపతి శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం ముత్యాల తలంబ్రాల ఊరేగింపు ఘనంగా జరిగింది. ముందుగా టీటీడీ పరిపాలనా భవనంలోని ఖజానా విభాగంలో అధికారులు ముత్యాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముత్యాలను అంబారీలపై ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీ కోదండరామాలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆనందకుమార్ దీక్షితులకు అందించారు. ఈ ఊరేగింపు తీర్థకట్ట వీధి, గాంధీ రోడ్డు, శ్రీగోవిందరాజస్వామి ఆలయ దక్షిణ మాడ వీధి, బజారు వీధి గుండా ఆలయానికి చేరుకుంది. గురువారం సాయంత్రం జరిగే శ్రీ సీతారాముల కల్యాణంలో ఈ ముత్యాల తలంబ్రాలను వినియోగిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో పార్థసారథి, సూపరింటెండెంట్ సోమశేఖర్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.