తిరుమలలో వైభవంగా పుష్పాల ఊరేగింపు
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగ మహోత్సవానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు ఆదివారం తిరుమలలో ఘనంగా జరిగింది. తిరుమలలోని కల్యాణవేదిక వద్దగల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఉద్యానవన సిబ్బంది, శ్రీవారి సేవకులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఈవో ఎవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి పుష్పయాగాకి శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా స్నపనతిరుమంజనం జరిగిందని చెప్పారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శోభాయమానంగా పుష్పయాగం జరుగుతుందన్నారు. ఇందుకోసం 17 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను వినియోగిస్తామని చెప్పారు. తమిళనాడు నుంచి నాలుగు టన్నులు, కర్ణాటక నుంచి రెండు టన్నులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి రెండు టన్నులు కలిపి మొత్తం 8 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం పుష్పయాగాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలియజేశారు.

వేడుకగా స్నపన తిరుమంజనం
శ్రీవారి ఆలయంలో పుష్పయాగం సందర్భంగా ఆదివారం ఉదయం రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేశారు. అక్కడ స్నపనతిరుమంజనంలో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో విజివో నందకిషోర్, పేష్కార్ శ్రీహరి, పారుపత్తేదార్ ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: A magnificent procession of flowers in Tirumala
