ఆ పోలీసులపై చర్య తీసుకోవాలి
నెల్లూరు ముచ్చట్లు:
అసలైన నిందితుడిని తప్పించి మరొకరిని హత్య కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ ఆదేశించారు.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాళెం గ్రామానికి చెందిన మైలారి పెంచలయ్య ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో వెంకటాచలం పోలీసులు విచారణ పేరుతో అసలైన నిందితుడిని తప్పించి మరొకరిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనీ, తమకు న్యాయం చేయాలని కోరుతూ పెంచలయ్య బంధువులు ఎస్సీ కమిషన్ను ఆశ్రయించారు. దీంతో ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ బుధవారం రాత్రి గుడ్లూరువారిపాలేనికి వచ్చి పెంచలయ్య భార్య శ్రావణి, కుటుబ సభ్యులతో మాట్లాడారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. ఫిర్యాదు అనంతరం జరిగిన పోలీసుల విచారణ జరిపిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు అసలైన నిందితుడిని పక్కన పెట్టి హతుడి భార్యకు తమ్ముడు వరుస అయిన వ్యక్తిని తీసుకెళ్లి స్టేషన్లో నిర్బంధించి హత్య చేసినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారన్నారు. ఈ కేసును తక్షణమే హత్య కేసుగా నమోదు చేయాలని డీఎస్పీకి సూచించగా, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరవాత చేస్తామని డీఎస్పీ హరనాథ్రెడ్డి వివరించారు. ముందుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్య కేసు కట్టి పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరవాత మిగిలినవి నమోదు చేయాలన్నారు. హతుడి భార్యకు ప్రభుత్వం తొలివిడత రావాల్సిన నగదు రూ.4,12,500 నగదుతోపాటు, ఆర్నెల్లకు సరిపడా నిత్యావసరాలు అందజేయాలని ఆదేశించారు. హంతకుడిని తప్పించేందుకు ప్రయత్నించిన సీఐతో పాటు మహిళా కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని డీఎస్పీని ఆదేశించారు. ఆయన వెంట పలువురు అధికారులున్నారు.
Tags: Action should be taken against the police