అద్దంకి దయాకర్…ఇంటి పోరు
నల్గొండ ముచ్చట్లు:
ఇలా వచ్చి… అలా వెళ్లిపోయే వ్యక్తికి టికెట్ ఇస్తారా…? ఇలాంటి వ్యక్తులతో పార్టీ ఎలా ముందుకు పోతుంది..? మమ్మల్ని పట్టించుకునే వారు ఎవరు…? అధికార పార్టీ ఆగడాలతో అన్ని రకాలుగా నష్ట పోతున్నాం..! హైదరాబాద్, ఢిల్లీ నగరాలల్లో కూర్చొని టీవీల్లో చర్చా వేదికల ద్వారా, పత్రికలలో పోజులు ఇచ్చే మనిషి పైరవీల ద్వారా రెండు మార్లు టిక్కెట్టు పొంది వస్తే మీ ఆదేశాల ప్రకారం గెలుపు కోసం కష్టపడి పనిచేశాం…! 2014లో మొదటిసారిగా తీసుకొచ్చి పోటీ చేపిస్తే ఓడిపోయిన తర్వాత మా ముఖాలను కూడా చూడలేదు…! 2018లో ఇదే పరిస్థితి జరిగింది…! ఆనాటినుండి నేటి వరకు కూడా పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి తుంగతుర్తి వైపు రాలేదు. మా గురించి పట్టించుకోలేదు…! మరి మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి…! ఇక అలాంటి వ్యక్తిని మళ్లీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దు. రెండుసార్లు తప్పు చేసిన మనం మూడోసారి తప్పు చేస్తే చరిత్ర కూడా క్షమించదు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గస్థాయి డిజిటల్ సభ్యత్వ నమోదు సమావేశంలో కార్యకర్తలు వెలిబుచ్చిన మాటలివి.కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టుతో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండుమార్లు పోటీ చేసి ఓటమిపాలైన అద్దంకి దయాకర్ పై క్యాడర్ పరోక్షంగా అనేక విసుర్లు విసిరారు. పోటీ చేయడానికి పైరవీలు చేసుకొని టిక్కెట్టు తెచ్చుకుంటూ… ఓడిపోయాక మొహం చాటేస్తున్నారంటూ క్యాడర్ ముక్తకంఠంతో మండిపడింది. ఇలాంటి వ్యక్తులను మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదని సమావేశానికి హాజరైన క్యాడర్ అంతా పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఆర్.దామోదర్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. గ్రామాలలో పార్టీ పటిష్టంగా ఉన్నప్పటికీ నాయకత్వం లేక క్యాడర్ అయోమయంలో ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కొన్ని గ్రామాల్లో క్యాడర్ మధ్యనే సమన్వయ లోపం ఉందని, ముందు ఒక మాట… వెనక మరో మాటలాగా కొంతమంది కోవర్టులు ఉండడం మూలంగా పార్టీ దెబ్బ తినే పరిస్థితి ఉందని వివరించారు.నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో విస్తరించి ఉన్న తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకోవాలంటే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ఇప్పుడే ప్రకటించాలని క్యాడర్ డిమాండ్ చేసింది. మొదటి నుండి పార్టీనే నమ్ముకుని కష్టాలను ఎదుర్కొంటూ క్యాడర్ మధ్య పనిచేసే వారికే టిక్కెట్టు ఇవ్వాలని కోరారు. చివరికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న కలగజేసుకొని క్యాడర్ నిర్ణయించిన వ్యక్తికే టికెట్ వస్తుంది తప్ప పైరవీకార్లను నమ్మేదిలేదంటూ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇటీవలే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో తుంగతుర్తిలో పోటీ చేసే అభ్యర్థిపై ప్రత్యేకంగా చర్చలు జరిపినట్లు తెలిపారు. పైరవీల ద్వారా గతంలో రెండు మార్లు టికెట్టు పొంది.. ఓటమి తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ చర్చించినట్లు ఆయన వివరించారు. దీనికి రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకుంటూ అభ్యర్థి ఎంపిక వ్యవహారం మనకే అప్పగించినట్లు ఆయన వివరించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్రెడ్డి
Tags; Addanki Dayakar … Home fight