Natyam ad

కెనడాకు మద్దతుగా నిలిచిన  అమెరికా, బ్రిటన్‌ దేశాలు

న్యూ డిల్లీ ముచ్చట్లు:

సిక్కు వేర్పాటువాది, ఖలిస్థాన్‌ ఉగ్రవాది నిజ్జర్‌ హత్యతో భారత్‌- కెనడా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదిరిన వేళ.. అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్‌ దేశాలు కెనడాకు మద్దతుగా నిలిచాయి. భారత్‌లోని 41 మంది కెనడా దౌత్యవేత్తలకు, వారి కుటుంబాలకు ఉండే అంతర్జాతీయ దౌత్యపరమైన రక్షణలను ఉపసంహరిస్తామని భారత్‌ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో ఆ దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకుంటున్నట్టు కెనడా శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై అమెరికా, బ్రిటన్‌ దేశాలు స్పందించాయి. ఈ విషయంలో కెనడాకు మద్దతుగా నిలిచాయి.ఈ మేరకు దౌత్యవేత్తల సంఖ్య తగ్గించాలంటూ కెనడాను ఒత్తిడి చేయొద్దని భారత ప్రభుత్వాన్ని కోరాయి. ‘దౌత్యసిబ్బంది సంఖ్య తగ్గించుకోవాలన్న భారత్ డిమాండ్ మేరకు కెనడా దౌత్యవేత్తల తరలింపు మాకు ఆందోళన కలిగిస్తోంది’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు. ‘క్షేత్రస్థాయిలో విభేదాలను పరిష్కరించేందుకు దౌత్యవేత్తలు అవసరం. దౌత్య సిబ్బందిని తగ్గించాలని పట్టుబడవద్దని మేము భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే నిజ్జర్‌ హత్య విషయంలో కెనడా దర్యాప్తునకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దౌత్య సంబంధాలపై 1961 వియన్నా ఒప్పందం ప్రకారం భారత్‌ తన బాధ్యతలను నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. ‘కెనడా దౌత్యవేత్తలు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలంటూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో మేం ఏకీభవించడం లేదు. కెనడా దౌత్యవేత్తల ఏకపక్ష తొలగింపు వియన్నా ఒప్పంద సూత్రాలకు అనుగుణం కాదు’ అని బ్రిటన్‌ వెల్లడించింది.ఖలిస్థాన్‌ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ ప్రమేయం ఉందంటూ ఇటీవలే కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

 

 

 

Post Midle

ట్రూడో ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే తమ దేశంలోని 41మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని భారత్‌ ఆదేశించింది. ఈ మేరకు కెనడాకు భారత్‌ డెడ్‌లైన్‌ పెట్టింది. దీంతో కేంద్రం విధించిన డెడ్‌లైన్‌ ముగియడంతో భారత్‌లోని తమ దౌత్యవేత్తలను తరలించినట్లు కెనడా శుక్రవారం వెల్లడించింది. 41 మంది కెనడా దౌత్యవేత్తలు తమ కుటుంబంతో సహా భారత్‌ను వీడినట్లు తెలిపింది. ఆ తర్వాత కొద్దిసేపటికే భారత్‌లో పర్యటిస్తున్న తమ దేశ పౌరులకు కీలక హెచ్చరికలు చేసింది. భారత్‌లోని పలు నగరాల్లో ఉన్న కెనడా వాసులు అప్రమత్తంగా ఉండాలని అడ్వైజరీ జారీ చేసింది.ఇటీవలే చోటు చేసుకున్న పరిణామాలతో భారత మీడియా, సామాజిక మాధ్యమాల్లో కెనడాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని అడ్వైజరీలో పేర్కొంది. ఈ క్రమంలోనే కెనడా పౌరులపై బెదిరింపులు, వేధింపులు జరగొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. అందువల్ల దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతాలతోపాటు బెంగళూరు, చండీగఢ్‌, ముంబై నగరాల్లో ఉన్న కెనడియన్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఎవరూ తమ వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించింది.

 

Tags: America and Britain supported Canada

Post Midle