తిరుమలలో ఘనంగా అనంతపద్మనాభ వ్రతం
తిరుమల ముచ్చట్లు:

తిరుమలలో గురువారం నాడు అనంతపద్మనాభ వ్రతం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ భూవరాహస్వామి ఆలయం వద్దనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు వేంచేపు చేశారు. అక్కడ చక్రత్తాళ్వార్లకు అభిషేకాదులు నిర్వహించిన అనంతరం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.

ప్రతి సంవత్సరం బాధ్రపదమాస శుక్ల చతుర్దశి పర్వదినాన అనంతపద్మనాభస్వామివ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మహిళల సౌభాగ్యం కోసం వరలక్ష్మివ్రతం ఎలా చేస్తారో, పురుషులకు సిరిసంపదలకోసం అనంతపద్మనాభ వ్రతాన్ని నిర్వహిస్తారు. పాలసముద్రంలో శేషశయ్య మీద పవళించి ఉండే దివ్యమంగళ స్వరూపమే అనంతపద్మనాభుడు. ఈ వ్రతంలో భూభారాన్ని మోస్తున్న అనంతుడిని, ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకుని పవళించి ఉన్న శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ అర్చకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Anantapadmanabha Vratam in Tirumala
