మునుగోడు కోసం బండి ప్రణాళికలు
హైదరాబాద్ ముచ్చట్లు:
పుల్ ఆర్కు మరో ఆర్ను కలిపేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటించి బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఉప ఎన్నిక వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే పట్టుదలతో స్పీడ్ పెంచారు.2018 సాధారణ ఎన్నికల తరువాత అసెంబ్లీలో బీజేపీ ఒకే సీటుకు పరిమితమైంది. అయితే బీజేపీ స్టేట్ చీఫ్ గా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తరువాత దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపొంది సీట్ల సంఖ్యను మూడుకు పెంచుకున్నది. రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ లు ‘ట్రిపుల్ ఆర్’గా ప్రాచుర్యం పొందారు. ఈ నేపథ్యంలో మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించడం ద్వారా మరో ఎమ్మెల్యే సీటును సొంతం చేసుకొని, నాలుగో ఆర్ ను చేర్చుకోవాలని వ్యూహరచన చేస్తున్నది.ఓ వైపు ప్రజాసంగ్రామ యాత్రను కొనసాగిస్తున్న బండి సంజయ్.. మరోవైపు రాజగోపాల్ రెడ్డిని చేర్చుకోవడం, ఉప ఎన్నిక వస్తే రచించాల్సిన వ్యూహాలపై ప్రణాళికలు రచిస్తున్నారు. బుధవారం పాదయాత్ర లంచ్ విరామ సమయంలో బండి సంజయ్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ ఇన్ చార్జి మురళీధర్ రావు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే రాజీనామా, ఉప ఎన్నికల అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం.
టీఆర్ఎస్కు దీటుగా పోరాడుతున్న బీజేపీ రాష్ట్ర శాఖ కూడా అధికార పార్టీని ఎదుర్కోవడానికి అన్నివిధాలుగా రాష్ట్ర శ్రేణులను సమాయత్తం చేస్తున్నట్లు తెలిసిందిమునుగోడు నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. చౌటుప్పల్, నారాయణపూర్, గట్టుప్పల్, చండూర్, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడతోపాటు రెండు మున్సిపాల్టీలు చౌటుప్పల్, చండూర్ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పార్టీ యంత్రాంగాన్ని ఉప ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసే యోచనలో బండి సంజయ్ ఉన్నట్లు తెలుస్తున్నది. దుబ్బాక, హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడానికి పార్టీ సీనియర్ నేతను మునుగోడు ఉప ఎన్నికల ఇన్ చార్జీగా నియమించాలని పార్టీ శ్రేణులు బండికి సూచించినట్లు తెలుస్తున్నది. ఏపీ జితేందర్రెడ్డి లక్కీ హ్యాండ్ అని భావిస్తున్న బీజేపీ ఆయన్నే ఇన్ చార్జీగా నియమిస్తే ఉప ఎన్నికల్లో గెలుపొందడం తథ్యమనే భావన కమలనాథులు ఉన్నారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని చెబుతున్నారు. పార్టీలో అందరితో సంప్రదించిన తరువాతే నియమించే యోచనలో బండి సంజయ్ ఉన్నట్లు టాక్అంతేకాకుండా త్వరలోనే కోర్ కమిటీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఇతర సీనియర్ నాయకులతో సంప్రదించి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయనున్నారు.

అంతేకాకుండా పలు మండలాలకు, మున్సిపాలిటీలకు సైతం ఇన్ చార్జీలను నియమించాలని బండి సంజయ్ యోచిస్తున్నారు. ఇదిలా ఉండగా మునుగోడులో నెలకొన్న పరిస్థితులపై సీనియర్ నాయకుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్రెడ్డితో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలతో ఇప్పటికే బండి పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
మునుగోడు నియోజకవర్గంలో సామాజికవర్గాల వారీగా చూస్తే గౌడ్స్, యాదవులు, రెడ్డి, పద్మశాలి, లంబాడ, మాదిగ సామాజికవర్గాలవారు అధికంగా ఉన్నారు. సామాజికవర్గాలను దృష్టిలో ఉంచుకొని ఇన్ చార్జీలను నియమించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రభావితం చేసే నేతలకు అధిక ప్రాధాన్యత కల్పించే యోచనలో బండి సంజయ్ ఉన్నట్లు సమాచారం. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో నెలకొన్న రాజకీయపరిస్థితులపై పలు సంస్థలతో వివిధ అంశాలపై సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ సర్వే రిపోర్డుల ఆధారంగా వ్యూహరచన చేస్తూ ముందుకు వెళ్లాలని రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తున్నది. ఇదిలా ఉండగా మునుగోడు ఉప ఎన్నికపై కేంద్రనాయకత్వానికి ఇప్పటికే పార్టీ రాష్ట్రశాఖ తరుపున ఒక నివేదికను పంపినట్టు తెలుస్తున్నది. దీని ఆధారంగా ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలని కేంద్ర నాయకత్వం దిశానిర్దేశం చేయనున్నది.
Tags: Cart plans for the future
