Date:20/01/2021
మెదక్ ముచ్చట్లు:
గ్రామీణ ఉపాథి హామీ పథకం, కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ రెండు కోట్లతో రాష్ట్రంలోనే మొట్టమొదటి పశువుల హాస్టల్ ఏర్పాటు చేశారు. పొన్నాల విలేజ్ యూనిట్గా పశువుల హాస్టల్ను ఏర్పాటు చేసి ఆ గ్రామంలోని పశువులను అక్కడే వుంచి హాస్టల్ మెయింటెనెన్స్ బాధ్యతలని రైతులు, మహిళాసంఘాల మెంబర్స్కి అప్పగించారు.పొన్నాలలో ఆరు ఎకరాల స్థలంలో 160 పశువుల కోసం మొత్తం పది షెడ్లను నిర్మించి ఒక్కొక్క షెడ్లో 16 పశువులను ఉంచటానికి ఏర్పాట్లు చేశారు. ఎస్సీ కార్పొరేషన్, స్త్రీ నిధి రుణాల ద్వారా పొన్నాల గ్రామంలోని రైతులు, 30 మహిళా సంఘాల సభ్యులకు పాడి బర్రెలు కొనుక్కోవటానికి లోన్స్ ఇచ్చారు . ఇప్పటికి 32 మంది కొనుక్కున్న 64 పాడి బర్రెలను హాస్టల్లో ఉంచి రోజుకు 150 లీటర్ల పాలు తీస్తున్నారు. మరో వారం రోజుల్లో హాస్టల్లో160 పశువులు ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. పశువులు ఉండి వాటిని పెంచటానికి సరైన ఏర్పాట్లు చేసుకోలేని వాళ్లు ఇక్కడ వాళ్ల పశువులని కట్టేసుకోవచ్చన్నమాట.పశువుల హాస్టల్ అంటే ఏదో ఆవులు, బర్రెలని కట్టేసుకోవటానికి ఓ షెడ్ వేశారు అనుకోవద్దు.
మంచి స్టాండర్డ్ తో షెడ్లు కట్టడమేకాదు… నీటి తొట్లు, వాటర్ ట్యాంక్, డ్రైనేజీ, కరెంట్ సప్లైఉన్నాయి. వీటితో పాటు గడ్డి కోసే యంత్రాలు, పాలు స్టోర్ చేయటానికి ఒక గది, పాలు పితికే యంత్రాలు, వెటర్నటీ హాస్పిటల్, మెయింటెనెన్స్ స్టాఫ్ కోసం క్వార్టర్స్, దోమలు కుట్టకుండా ఫ్యాన్లు, మ్యూజిక్సిస్టమ్ ఉన్నాయి. వెటర్నరీ డాక్టర్ పశువులను పరీక్షించటానికి వీలుగా ప్రత్యేకమైన స్టాండ్తో పాటు హాస్టల్ చుట్టు ప్రహారీ గోడ, సీసీ కెమెరాలతో హాస్టల్ కట్టారు. ఇంతకు ముందు గొర్రెల కోసం ఇలాంటి హాస్టల్స్ ఏర్పాటు చేశారు. అదే పద్ధతిలో పాల మీద ఆధారపడే రైతుల కోసం ఇప్పుడు ఈ పశువుల హాస్టల్ కట్టాలనే ఆలోచనని ఇలా ఇంప్లిమెంట్ చేశారు. పొన్నాల పశువుల హాస్టల్ ఆలోచన సక్సెస్ కావటంతో సిద్దిపేట నియోజకవర్గంలోనే ఉన్న ఇరుకోడు, మిట్టపల్లి, ఇబ్రహీంపూర్, జక్కాపూర్, గుర్రాలగొంది, గట్ల మల్యాల, నర్మెట గ్రామాల్లో ఇలాంటి హాస్టల్స్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట అధికారులు.వ్యవసాయానికితోడు డెయిరీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం, గ్రామాల్లోని చిన్న, సన్నకారు రైతులు పశువుల్ని పెంచేందుకు ఇబ్బంది పడకుండా ఈ హాస్టల్స్ చాలా ఉపయోగ పడతాయి. పశువులు కొనుక్కోవాలనుకున్నా సరైన ప్లేస్ లేక కొనకుండా ఉన్నవాళ్లకి లోన్లు ఇచ్చి పశువులని కొనేలా చేశారు. వాళ్లకోసం ఈ హాస్టల్ చాలా ఉపయోగపడుతోంది.
పశువుల మేతకు అవసరమైన గడ్డి పెంపకానికి ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి పశు సంవర్థక శాఖ తరపున సాయాన్ని అందించనున్నారు.పశువులకు మేత, పాలు పితకడం, పేడ ఏరడం వంటి విషయాలను రైతులు చూసుకుంటుంటే, మిల్క్ ప్రొడక్షన్, సేల్స్, ప్రాఫిట్స్ లెక్కలను మహిళా సంఘం మెంబర్స్ చూసుకుంటారు. పొన్నాల విలేజ్ లోని 30 మహిళా సంఘాలు పశువుల హాస్టల్ నిర్వహణ బాధ్యతలను చూస్తున్నారు. ఉత్పత్తి అయిన పాలను కొందరు ప్రైవేటుగా అమ్ముకుంటే మరి కొందరు విజయ డైరీకి అమ్ముతున్నారు. హాస్టల్ మెయింటెనెన్స్ని మానిటర్ చేయటానికి పది మందితో కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.పశువుల హాస్టల్ ఏర్పాటుతో పొన్నాలలో మహిళా సంఘ సభ్యులకు, పాడి రైతులకు చేతి నిండా పనిదొరికింది. ఇప్పటికే హాస్టల్లో 70 పశువులున్నాయి. ఇంకా కొందరు పశువులను కొనటానికి సిద్దంగా ఉన్నారు. మన రాష్ట్రంలోని మొట్టమొదటి పశువుల హాస్టల్ పొన్నాలలో ఏర్పాటు కావడం ఎంతో సంతోషంగా వుంది. చాలామందికి ఉపయోగ పడే ఇలాంటి హాస్టల్స్ ఇంకా కొన్ని ఏర్పాటు కావాల్సి ఉంది.
Tags:Cattle hostel in Siddipet