పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం జగన్
ఏలూరు ముచ్చట్లు:
పోలవరం ప్రాజెక్టు పనులను ఏపీ సీఎం వైఎస్ జగన్ పరిశీలించారు. మంగళవారం ఉదయం తాడేపల్లి నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో సీఎం జగన్ ఏలూరు జిల్లాకు బయలుదేరారు. హెలికాప్టర్ ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ తిలకించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ఈ ఎగ్జిబిషన్ లో అధికారులు సీఎం జగన్ కు తెలిపారు.గోదావరి నదికి వరద పోటెత్తిన సమయంలో కూడ వరదను తట్టుకొనేలా ఎగువ కాఫర్ డ్యామ్ 44 మీటర్ల ఎత్తుకు పెంచారు. దిగువ కాఫర్ డ్యామ్ ను 31.5 మీటర్ల ఎత్తులో పూర్తి నిర్మించారు. 2021 జూన్ 11న స్పిల్ వే మీదుగా వరద ప్రవాహం మళ్లించారు. దీంతో వరద సమయంలోనూ మెయిన్ డ్యామ్ పనులకు మార్గం సుగమమైంది. పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.
పోలవరం ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు నీటిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు.పోలవరం ప్రాజెక్టుకు రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి నిధుల విషయమై ఏపీ అధికారులతో కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ఇటీవల సమావేశమయ్యారు.పోలవరం ప్రాజెక్టులో 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నారు. అయితే దశలవారీగా పోలవరం ప్రాజెక్టును నింపుతారు. ఒకేసారి పోలవరం ప్రాజెక్టును పూర్తిస్థాయి నీటి మట్టంతో నింపరు. తొలి ఏడాదిలో 41.15 మీటర్ల మేర నీటిని నిల్వ చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తులో గరిష్టంగా నీటిని నిల్వ చేయవద్చు.
Tags: CM Jagan inspected the works of Polavaram project