Natyam ad

కర్ణాటకలో బీఆర్ఎస్ పోటీకి దూరం

బెంగళూరు,    ముచ్చట్లు:

 

బీఆర్ఎస్ గా మారిన తర్వాత పొరుగు రాష్ట్రమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ తేదీలను కూడా ప్రకటించనుంది. తెలంగాణ కంటే ముందుగానే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో పోటీ బీఆర్ఎస్ బరిలోకి దిగుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి, ఢిల్లీలో కార్యాలయం ప్రారంభానికి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హాజరయ్యారు. జేడీఎస్‌తో కలసి పోటీ చేస్తుందని అందరూ భావించారు. మహారాష్ట్ర మాదిరిగానే కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోనూ ఎక్కువ మంది తెలుగు వాళ్లున్నారు.

 

 

 

 

Post Midle

అక్కడ పోటీ చేసి కర్ణాటకలో తమ సత్తా చాటాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారు. ఈ మేరకు సన్నిహితుల వద్ద కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. జేడీఎస్, బీఆర్ఎస్ కలసి పోటీ చేస్తే కనీస స్థానాలను సాధించవచ్చని కూడా కేసీఆర్ అనుకున్నారు. అయితే మహారాష్ట్రలో వరసగా సభలు పెడుతున్న కేసీఆర్ కర్ణాటకలో మాత్రం ఫోకస్ చేయకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. మహారాష్ట్రపై పెట్టిన శ్రద్ధ కన్నడ రాష్ట్రంలో ఎందుకు పెట్టడం లేదన్న ప్రశ్న సహజంగా బీఆర్ఎస్ నేతల్లోనే తలెత్తుతుంది.

 

 

 

అయితే ఇందుకు అనేక కారణాలున్నాయంటున్నారు. మరింత ఉత్సాహంగా కాంగ్రెస్ వీక్ అవుతుందనా? మహారాష్ట్రలో కాంగ్రెస్, బీజేపీలే ఎక్కువగా పోటీ పడుతున్నాయి. తాము పోటీ చేస్తే కొన్ని చోట్ల బీజేపీ లాభపడే అవకాశముందని భావించిన కేసీఆర్ పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తప్పుపట్టారు. బీజేపీ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ తో కలసి విపక్షాలు చేస్తున్న ఆందోళనలో కూడా ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు పాల్గొంటున్నారు. పార్లమెంటుకు బీఆర్ఎస్ ఎంపీలు నల్లదుస్తులు ధరించి కాంగ్రెస్ తరహాలోనే హాజరుకావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది

 

అయితే ఇంకా సమయం ఉందని, పోటీ చేసే నిర్ణయం వెలువడుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. కన్నడ రాష్ట్రంలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఒక్కలిగ సామాజికవర్గానికి చెందిన వారు. అదే సామాజికవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీగా అక్కడ జేడీఎస్ ఉంది. దానితో కలసి పోటీ చేస్తే కాంగ్రెస్‌‌కు ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన వెనుకంజ వేస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ ఇప్పటికే కర్ణాటకలో 124 మందితో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. జేడీఎస్ ఇంకా పొత్తులపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అది పాత మైసూరుతో పాటు మరికొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఉప ప్రాంతీయ పార్టీ. అందుకోసమే కేసీఆర్ కన్నడ రాష్ట్రంలో కాలుమోపడానికి కొంత వెనుకంజ చేస్తున్నారని చెబుతున్నారు. మరి కేసీఆర్ రానున్న కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.

Tags;Distance to BRS competition in Karnataka

Post Midle