Natyam ad

అక్రమ మైనింగ్ ఆరోపణలు వచ్చిన ప్రాంతాలను పరిశీలిస్తున్న డిఎంజి  వి.జి.వెంకటరెడ్డి

– చిత్తూరు జిల్లాలో డిఎంజి శ్రీ వి.జి.వెంకటరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు
– కుప్పం అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ ప్రాంతాల పరిశీలన
– మహాచెక్ లో భాగంగా గత రెండు రోజులుగా 4 బృందాలతో కొనసాగుతున్న తనిఖీలు
– 2009 నుంచి ఇప్పటి వరకు పలుసార్లు ఇదే ప్రాంతంలో అక్రమ మైనింగ్ కు యత్నాలు
– సమాచారం అందిన ప్రతిసారీ అడ్డుకున్న గనులశాఖ
– రాష్ట్ర వ్యాప్తంగా గనుల శాఖ దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు రూ.5 కోట్ల విలువైన 555 గ్రానైట్ బ్లాక్ ల స్వాధీనం
– తాజాగా శాంతిపురం, ద్రవిడ యూనివర్సిటీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ పై దాడులు
– ఈ దాడుల్లో 40 గ్రానైట్ బ్లాక్స్,  06 కంప్రెషర్లు, 02 హిటాచీ యంత్రాల సీజ్
– అక్రమ మైనింగ్ ని అడ్డుకునేందుకు పటిష్ఠమైన చెక్ పోస్ట్ వ్యవస్థ
– ఇతర రాష్ట్రాల సరిహద్దులో చెక్ పోస్ట్ ల ద్వారా ప్రత్యేక నిఘా
– రెవెన్యూ, పోలీస్, గనులశాఖ అధికారులతో మొబైల్ తనిఖీ బృందాలు
– రాష్ట్ర వ్యాప్తంగా సీజ్ చేసిన మినరల్స్ వేలంకు ప్రణాళిక
– వేలంద్వారా ప్రభుత్వానికి ఆదాయం: వి.జి. వెంకటరెడ్డి
చిత్తూరు ముచ్చట్లు:
 
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పరిధిలో అక్రమ మైనింగ్ జరుగుతుందనే ఆరోపణలు వస్తున్న ప్రాంతాలను రాష్ట్ర గనులు మరియు భూగర్భ శాఖ డైరెక్టర్ (DMG) శ్రీ  వి.జి.వెంకట్ రెడ్డి పరిశీలించారు. గురువారం గనుల శాఖ డిడి ప్రకాష్, ఎడి పి.వేణుగోపాల్ లతో కలిసి శాంతిపురం, ద్రవిడ యూనివర్సిటీ భూముల్లో అక్రమ క్వారీయింగ్ ప్రాంతాన్ని తనిఖీ చేశారు.అటవీశాఖ ఆధీనంలోని ఈ భూముల్లో అక్రమంగా కొందరు వ్యక్తులు మైనింగ్ చేస్తున్నారని, సమాచారం అందిన ప్రతిసారీ దాడులు నిర్వహించి, వాహనాలు, యంత్రాలు, గ్రానైట్ మెటీరియల్ ను స్వాధీనం చేసుకుంటున్నామని ఈ సందర్భంగా అధికారులు డిఎంజికి వివరించారు.తాజాగా శాంతిపురం, ముద్దనపల్లె ప్రాంతంలో గత అక్టోబర్ 25, 28, డిసెంబర్ 23వ తేదీన ఇదే ప్రాంతంలో అక్రమ మైనింగ్ పై దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో  సర్వే నంబరు 104, 213 పరిధిలోని అటవీభూముల్లో  భారీగా గ్రానైట్ బ్లాకులను సీజ్ చేశామని తెలిపారు.ఇదే ప్రాంతంలో మైనింగ్ అక్రమాలపై తాజాగా 4 బృందాలతో మహాచెక్ లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో 40 గ్రానైట్ దిమ్మెలు, 06 కంప్రెషర్లను 02 హిటాచీ యంత్రాలను లను సీజ్ చేయడం జరిగిందని అధికారులు వివరించారు.ఈ ప్రాంతలను పరిశీలించిన అనంతరం డిఎంజి శ్రీ వి.జి.వెంకటరెడ్డి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. అటవీశాఖ పరిధిలో అక్రమంగా జరుగుతున్న మైనింగ్ పై ఆ శాఖ ఉన్నతాధికారులను ఎప్పటి కప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. ఈ మేరకు డిఎఫ్ఓ కు లేఖ రాయడంతో పాటు ఇక్కడి పరిస్థితిని వివరించి అటవీ అధికారుల నిఘాను పెంచేలా చూడాలన్నారు. ఫారెస్టు యాక్ట్ 1980 ప్రకారం అక్రమార్కులపై కేసులు నమోదు అయ్యేలా చూడాలన్నారు.
 
 
ద్రావిడ విశ్వ విద్యాలయం పరిధిలోని భూముల్లో అక్రమ మైనింగ్ పై  గతంలో దాడులు చేసి 131 గ్రానైట్ బ్లాకులను సీజ్ చేయడం జరిగిందని అధికారులు డిఎంజికి వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ యూనివర్సిటీ లోని హరప్పా భవనం సమీపంలోని భూముల్లోకి ఎవరూ వెళ్ళకుండా గాడి కొట్టించి,  సెక్యూరిటీ గార్డ్ ను నియమించాలని, అనుమతి లేకుండా ఎవరినీ ఈ ప్రాంత పరిధిలోకి రాకుండా చూడమని యూనివర్సిటీ అధికారులను కోరాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలో అక్రమ మైనింగ్ ను అరికట్టే చర్యల్లో భాగంగా గనుల శాఖ ఆద్వర్యంలో ఈ మధ్యకాలంలో సుమారు రూ.5 కోట్ల విలువైన 555 గ్రానైట్ బ్లాక్ లను సీజ్ చేసినట్లు డీఎంజి  వి.జి. వెంకటరెడ్డి తెలిపారు. సీజ్ చేసిన ఖనిజాలను A.P e-procurement ద్వారా వేలంలో డిస్పోజ్ చేస్తామని వెల్లడించారు. సీజ్ చేసిన మినరల్స్ ను ఒక పద్దతి ప్రకారం వేలం వేయడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని అన్నారు. ఈ మేరకు ఆక్షన్ కు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.అక్రమ మైనింగ్ పై ప్రభుత్వం సీరియస్ ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చెక్ పోస్ట్ వ్యవస్థ ను పటిష్టం చేశామని అన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఇతర రాష్ట్రాలకు మినరల్స్ తరలించకుండా చెక్ పోస్ట్ ల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామని అన్నారు. అక్రమ మైనింగ్ బాద్యులైన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. మైనింగ్ అక్రమాలకు పాల్పడితే ఖఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ మైనింగ్ ఫిర్యాదులు వస్తున్న ప్రాంతాల్లో పోలీస్, రెవెన్యూ, గనులశాఖ అధికారుల బృందాలతో మొబైల్ తనిఖీలు కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: DMG VG Venkatereddy investigating areas where illegal mining allegations have been made