తలనొప్పిగా మారుతున్న ఈడీ కేసులు


హైదరాబాద్, ముచ్చట్లు:

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు ఇసుమంతైనా తగ్గంచినట్లు కనబడటం లేదు. మార్చి 11న ఇదే కుంభకోణం కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. కవిత విచారణకు హాజరవ్వడానికి ముందు వరకూ ఈడీ, మోడీ, మొదానీ అంటూ తీవ్ర స్థాయలో విరుచుకుపడిన బీఆర్ఎస్ శ్రేణులు ఆ తరువాత ఈ కేసుకు సంబంధంచి నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు.విచారణ తీరుపై కానీ, ఈ కేసు వెనుక కేసీఆర్ జాతీయ రాజకీయాలలో వేగాన్ని నియంత్రించే లక్ష్యం ఉందని కానీ విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ కేసులో కవితను బయటకు తీసుకురావడానికి తెరవెనుక రాజీ ప్రయత్నాలు ఫలించేలా కనిపించాయనీ, అందుకే పార్టీ అధినేత కేసీఆర్ కవిత కేసు విషయంలో విమర్శలు వద్దనీ, టీవీ టాక్ షోలలో సైతం విమర్శలు చేయవద్దనీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు బీఆర్ఎస్ శ్రేణులే లోపాయికారీగా అంగీకరించారు. అయితే ఆ ప్రయత్నాలేమిటి? ఎవరిని కాంటాక్ట్ చేశారు? అన్న విషయాలు మాత్రం బయటకు రాలేదు. దీంతో ఈడీ కవితను ఈ నెల 16న మరో సారి విచారణకు రావాల్సిందని చెప్పినప్పటికీ బీఆర్ఎస్ దానికి పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. తప్పని సరి లాంఛనంగానే ఈడీ కవితను మరోసారి విచారణకు పిలిచిందని భావించారు. అయితే ఈడీ మాత్రం ఈ కేసులో మనీ లాండరింగ్ ఉల్లంఘన, హవాలా లావాదేవీలు లాంటి ఆర్థిక అంశాల గుట్టుమట్ల నిగ్గు తేల్చే పనిలో ఉందని రాజకీయవర్గాలు అంటున్నాయి. దాదాపు ఎనిమిదిన్నర గంటలకు పైగా సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు పెద్ద వ్యవధి ఇవ్వకుండానే కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే మళ్లీ విచారణకు రావాలసి ఆదేశించారంటే తొలి రోజు విచారణలో తమ ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని ఈడీ అధికారులు భావించినట్లేనని పరిశీలకులు చెబుతున్నారు.అసలు తొలి విచారణలో ఈడీ అధికారులు ఏయే అంశాలపై కవితను ప్రశ్నించారన్న విషయంలో ఇటు కవిత నుంచి కానీ అటు ఈడీ వర్గాల నుంచీ కానీ క్లియర్ కట్ సమాచారం లేదు.
ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచారు. అయితే రెండో సారి స్వల్ప వ్యవధిలోనే విచారణకురావాల్సిందిగా ఆదేశించడంతో ఈ సారి కవిత ఆర్థిక మూలాల విషయంలో ఈడీ దృష్టి సారించే అవకాశం ఉందనిఅంటున్నారు. అందుకే ఈ నెల 16న విచారణకు పలు డాక్యుమెంట్లను తీసుకు రావాల్సిందిగా ఈడీ అధికారులు కవితను ఆదేశించినట్లు చెబుతున్నారు. అన్నిటికీ మించి సౌత్ గ్రూపు నుంచి ఆప్ నేతలకు అందినట్లుగా చెబుతున్న రూ. వంద కోట్ల రూపాయల ముడుపుల విషయంలో కవిత నుంచి వివరాలు రాబట్టడమే లక్ష్యంగా ఈనెల 16న ఈడీ అధికారుల విచారణ ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
కల్వకుంట్ల కవిత ఆదాయ వివరాలు, వివిధ కంపెనీలకు డైరెక్టర్గా ఉన్నందున వాటి ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్టులు తీసుకురావాల్సిందిగా కూడా ఈడీ అధికారులు ఆమెను ఆదేశించారని చెబుతున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే అరెస్టయిన వారి నుంచి తీసుకున్న వాంగ్మూలాలకు అనుగుణంగా కవిత నుంచి వివరాలు రాబట్టిన ఈడీ అధికారులు.. కస్టడీలో ఉన్న పిళ్లయ్, మనీశ్ సిసోడియా వెల్లడించే అంశాల ఆధారంగా కవితను ఈ నెల 16న విచారించే అవకాశాలున్నాయంటున్నారు. పిళ్లయ్ కస్టడీ సోమవారం తో ముగియనుండగా, సిసోడియా కస్టడీ ఈ నెల 17న ముగియనున్నది.
Tags;ED cases turning into headaches
