రాష్ట్రపతి పాలన కోసమే
-కాంగ్రెస్, జేడీఎస్ ప్రయత్నాలు
Date:20/07/2019
బెంగళూర్ ముచ్చట్లు:
కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ లు కర్ణాటక రాజకీయాన్ని ప్రతిరోజూ మలుపు తిప్పుతున్నాయి. కుమారస్వామి విశ్వాస పరీక్షను వీలయినంత వరకూ పొడిగించాలని రెండు పార్టీలూ భావిస్తున్నాయి. స్పీకర్ రమేష్ కుమార్ కాంగ్రెస్ కు చెందిన వారు కావడంతో వీలయినంతగా సమస్యను జాప్యం చేస్తూ వెళితే గవర్నర్ జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన విధిస్తారని ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యూహం రచిస్తున్నారు.కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి రాష్ట్రపతి పాలనను విధించారన్న సానుభూతిని రెండు పార్టీలూ పొందే అవకాశముంది. మరోవైపు
యడ్యూరప్పను కూడా ప్రస్తుతానికి ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునే వీలుంది. అందుకే గవర్నర్ వ్యవహారశైలిపై రెండు పార్టీలు మండిపడుతున్నాయి.
స్పీకర్ కూడా గవర్నర్ డెడ్ లైన్ విధించినా బేఖాతరు చేశారు. సోమవారం వరకూ విశ్వాసపరీక్షపై చర్చ జరుగుతుందని సిద్ధరామయ్య సంకేతాలు ఇవ్వడం కూడా అదే కారణమంటున్నారు.ఇలా గవర్నర్ ను రెచ్చగొడితే రాష్ట్రపతి పాలన వస్తుందని భావిస్తున్నారు. కర్ణాటకలో రాజకీయ సంక్షోభం నెలకొందని ఇప్పటికే గవర్నర్ వాజూబాయి వాలా కేంద్ర హోంశాఖకు నివేదిక పంపినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే రాష్ట్రపతిపాలనను కర్ణాటకలో విధించే అవకాశముంది. ఇది తమకు కలసి వచ్చే అంశంగా సిద్దరామయ్య, కుమారస్వామి భావిస్తున్నారు.
దీనివల్ల తమకు తగినంత సమయం కూడా దొరుకుతుందని విస్తున్నారు.రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల వ్యవహారమూ ఒక కొలిక్కి వస్తుందని, ఎమ్మెల్యేలను తిరిగి తమ గూటికి రప్పించుకునేందుకు వెసులుబాటు దొరుకుతుందని కాంగ్రెస్,
జేడీఎస్ ల ఆలోచనగా ఉంది. అందుకే సిద్దరామయ్య, కుమారస్వామిలు రాష్ట్రపతి పాలనే కోరుకుంటున్నట్లు కనపడుతుంది. బలపరీక్షను మరికొంత కాలం లాగితే గవర్నర్ ఖచ్చితంగా ఆ నిర్ణయానికి వస్తారని భావిస్తున్నారు. మొత్తం మీద కర్ణాటక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది.
Tags: For the sake of the presidency