అభాసుపాలవుతున్న పిల్లల ఉచిత పంపిణీ
ఖమ్మం ముచ్చట్లు:
మత్స్యకారులు ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు అమలు చేస్తున్న చేప పిల్లలు, రొయ్య పిల్లల ఉచిత పంపిణీ పథకం వైరాలో అభాస పాలవుతోంది. మత్స్యశాఖ అధికారులు కాంట్రాక్టర్ కుమ్మక్కై నాణ్యతలేని చేపపిల్లలను వైరా రిజర్వాయర్ లో విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా లక్షలాది పిల్లలను విడుదల చేస్తున్నామని ప్రకటిస్తూ కేవలం వేల సంఖ్యలోనే పిల్లలను రిజర్వాయర్లలో విడుదల చేస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. వైరా రిజర్వాయర్ లో శుక్రవారం రొయ్య పిల్లల విడుదలను మత్స్యకారులు అడ్డుకున్నారు. ముందుగా ఎమ్మెల్యే రాములునాయక్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కాంట్రాక్టర్ వ్యాన్ లో నాణ్యత లేని రొయ్య పిల్లలను తీసుకువచ్చి వైరా రిజర్వాయర్ లో పోసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నాన్ని స్థానిక మత్స్యకారులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు.నాణ్యతలేని రొయ్య పిల్లలను రిజర్వాయర్ లో విడుదల చేస్తే అవి పెరగక, బతికే అవకాశాలు లేక తమకు తీవ్ర నష్టం వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం ఉచితంగా చేప రొయ్య పిల్లల పంపిణీ నిర్వహిస్తూ.. ఉంటే కొందరు అధికారులు కాంట్రాక్టర్ తో కుమ్మక్కై నాసిరకం చేప, రొయ్య పిల్లలను విడుదల చేస్తున్నారంటూ మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఎన్ని లక్షల పిల్లలు విడుదల చేస్తున్నారో కూడా తెలియదంటూ ఆగ్రహించిన మత్స్యకారులు రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు.
రొయ్య పిల్లల పంపిణీలో వైరా రిజర్వాయర్ పరిధిలోని మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మత్స్యకారుల ఆవేదన వ్యక్తం చేశారు.సుమారు 45 రోజుల క్రితం కూడా 14 లక్షల పైచిలుకు చేప పిల్లల విడుదల చేయాల్సి ఉండగా కేవలం 18 వేల చేప పిల్లల మాత్రమే విడుదల చేశారు. అప్పట్లో ఎమ్మెల్యే సమక్షంలోనే ఈ బాగోతం బయటపడింది. తిరిగి శుక్రవారం ఏడు లక్షల పద్నాలుగు వేల రొయ్య పిల్లలను విడుదల చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రారంభించారు. అయితే మత్స్యకారులు మాత్రం తాము ఆశించిన స్థాయిలో నాణ్యమైన చేప, రొయ్య పిల్లలు విడుదల చేయడం లేదంటూ కాంట్రాక్టర్ తో కొందరు అధికారులు కుమ్మక్కై పోయి నాసిరకం చేప, రొయ్య పిల్లల్ని విడుదల చేస్తున్నారంటూ ఆగ్రహించారు. మత్స్యశాఖ అధికారులను మత్స్యకారులు నిలదీయడంతో ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించిన పది నిమిషాలకే చేసేదేమీ లేక కాంట్రాక్టర్ రొయ్య పిల్లలను తిరిగి తీసుకునిపోవాల్సి పరిస్థితి ఏర్పడింది. గతంలో కూడా తప్పుడు లెక్కలు చూపించి రొయ్య, చేప పిల్లలు పోశారని ఆశించిన స్థాయిలో మత్స్యకారులకు లాభాలు రాకపోగా నష్టాలే మిగిలాయంటూ పలువురు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tags: Free distribution of underprivileged children