ఆగస్టు 1 నుంచి 15 వరకు ఇంటింటా త్రివర్ణ పతాకం
అనంతపురం ముచ్చట్లు:
ఇంటింటా త్రివర్ణ పతాకం (హర్ ఘర్ తిరంగా) నినాదంతో 2022 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకుందామని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పిలుపునిచ్చారు. 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఆగస్టు 1 నుంచి 15 వరకు మొత్తం 15 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించేలా కార్యక్రమాల జాబితా సిద్ధం చేయాలని సూచించారు.ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకం ఎగరాలని, అందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జాతీయ జెండాలను పంపిణీ చేస్తామన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీసీ హాలులో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంపై రాష్ట్ర సాంస్కృతికశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లాలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమ నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. డీఆర్ఓ గాయత్రిదేవి, ఆన్సెట్ సీఈఓ కేశవ నాయుడు, జిల్లా పర్యాటక అధికారి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Tags: From August 1st to 15th, the tricolor flag is hoisted in every house

