Natyam ad

వైభ‌వంగా గ‌రుడ‌సేవ‌

– విశేష సంఖ్యలో దర్శించుకున్న భక్తులు

 

తిరుమల ముచ్చట్లు:

 

Post Midle

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన గురువారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు త‌న‌కు ఎంతో ప్రీతిపాత్ర‌మైన గ‌రుడ వాహ‌నంపై లక్ష్మీకాసుల మాల ధరించి భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చారు. రాత్రి 6.30 గంటలకు గ‌రుడ‌సేవ ప్రారంభ‌మైంది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా విచ్చేసిన భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.ముందుగా లక్ష్మీకాసుల మాలను ఈవో  ఎవి.ధర్మారెడ్డి దంపతులు శ్రీవారి ఆలయం నుండి ఊరేగింపుగా వాహనమండపం వద్దకు తీసుకొచ్చి మలయప్ప స్వామివారికి అలంకరించారు.మాడవీధులు నిండిన తరువాత నాలుగు కార్నర్లలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి ఇన్నర్ రింగ్ రోడ్ లో వేచి ఉన్న భక్తులకు గరుడ వాహన దర్శనభాగ్యం కల్పించారు. తద్వారా ఎక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.  ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్  భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు సభ్యులు  యానాదయ్య,
సుబ్బరాజు,  విశ్వనాథ్, ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు  వేమిరెడ్డి ప్రశాంతి, జేఈవోలు సదా భార్గవి,  వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో  న‌ర‌సింహ కిషోర్‌, ఎస్పీ  ప‌ర‌మేశ్వ‌రరెడ్డి, తిరుపతి డెప్యూటీ మేయర్  అభినయ్ రెడ్డి, కమిషనర్ హరిత ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

 

Tags:Glorious Garuda Seva

Post Midle