వైభవంగా వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామి కల్యాణం
– ఏప్రిల్ 2న రథోత్సవం
తిరుపతి ముచ్చట్లు:
వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా జరిగింది.రాత్రి 8 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ముందుగా ఆలయ అర్చకులు పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, విశేషారాధన చేశారు. ఆ తరువాత రక్షాబంధన, అగ్నిప్రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, స్వామి, అమ్మవారికి ప్రవరలు, మాంగళ్యపూజ చేపట్టారు. అనంతరం మాంగళ్యధారణ, ఉప యుక్తహోమాలు, పూర్ణాహుతి, నివేదన, అక్షతారోహణం, ముత్యాల తలంబ్రాల సమర్పణ, విశేష నివేదన, మాలమార్పిడి, అక్షతారోహణ, హారతి, చతుర్వేద పారాయణం, యజమానికి వేద ఆశీర్వాదం, హారతి ఇచ్చారు. కల్యాణం అనంతరం స్వామివారు గరుడవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.కాగా, ఉదయం 8 గంటలకు తిరుచ్చి ఉత్సవం, ఉదయం 10 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గురుమూర్తి, సూపరింటెండెంట్ చెంగల్ రాయలు, కంకణ బట్టర్ కృష్ణ ప్రసాద్ బట్టర్, ఆగమ సలహాదారులు మణికంఠ బట్టర్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు నాగరాజు, శ్రీకృష్ణమూర్తి,
ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 2న రథోత్సవం
వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ సీతాలక్ష్మణ సమేతశ్రీ పట్టాభిరామస్వామి రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం 9.15 గంటలకు రథోత్సవం ప్రారంభం అవుతుంది.ఏప్రిల్ 4న ఉదయం 10.50 గంటలకు చక్రస్నానం, ఏప్రిల్ 5న సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు పుష్పయాగం వైభవంగా జరుగనుంది.
Tags:Glorious Valmikipuram Sri Pattabhiramaswamy Kalyanam