కళాతపస్వి మృతికి గవర్నర్ సంతాపం
విజయవాడ ముచ్చట్లు:
ప్రముఖ సినీ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సిరి సిరి మువ్వ, శంకరాభరణం, సిరివెన్నెల వంటి కళాత్మక చిత్రాలతో సుపరిచితుడైన విశ్వనాథ్ చలనచిత్ర దర్శకునిగా, రచయితగా, నటుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు అనేక అవార్డులు అందుకున్న కళాతపస్వి మృతి తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని గవర్నర్ హరిచందన్ అన్నారు. గత అరవై ఏళ్లుగా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకుగానూ రఘుపతి వెంకయ్య పురస్కారం, పద్మశ్రీ వంటి అత్యున్నత అవార్డులు అందుకున్నారని హరిచందన్ పేర్కొన్నారు. విశ్వనాధ్ కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Tags: Governor condoles death of Kalathapaswi

