Natyam ad

యువ‌త‌లో భ‌క్తిభావ‌న పెంచేందుకు గోవింద కోటి

– విద్యార్థుల‌కు ప్ర‌సాదంగా కోటి భ‌గ‌వ‌ద్గీత పుస్త‌కాలు

– రూ.600 కోట్ల‌తో అచ్యుతం, శ్రీపథం వసతి సముదాయాలు

– శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు విస్తృత‌ ఏర్పాట్లు

Post Midle

– టీటీడీ ధర్మకర్తల మండలి అధ్య‌క్షులు   భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి

 

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

యువ‌త‌లో హైంద‌వ స‌నాత‌న ధ‌ర్మ వ్యాప్తి కోసం శ్రీ‌వారి ఆల‌యం నుండే తొలి అడుగు వేస్తున్నామ‌ని, ఇందులో భాగంగా రామ‌కోటి త‌ర‌హాలో గోవింద కోటి రాసిన 25 ఏళ్ల లోపు వారికి వారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఒక‌సారి తిరుమ‌ల స్వామివారి బ్రేక్ ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్య‌క్షులు   భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. 10 ల‌క్ష‌లా 1,116 సార్లు గోవిందనామం రాసిన‌వారికి ద‌ర్శ‌న సౌభాగ్యం క‌ల్పిస్తామ‌న్నారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి తొలి స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తీసుకున్న ముఖ్య నిర్ణ‌యాల‌ను ఛైర్మ‌న్ మీడియాకు తెలియ‌జేశారు.

 

– స‌నాత‌న ధ‌ర్మం ప‌ట్ల‌, మాన‌వీయ, నైతిక విలువ‌ల ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఎల్‌కెజి నుండి పిజి వ‌ర‌కు చ‌దువుతున్న విద్యార్థుల‌కు సుల‌భంగా అర్థ‌మ‌య్యేలా 20 పేజీల్లో భ‌గ‌వ‌ద్గీత సారాంశాన్ని పుస్త‌క ప్ర‌సాదంగా కోటి పుస్త‌కాలు ముద్రించి పంపిణీ చేస్తామ‌న్నారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు :

– అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. పెరటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది కావున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసి బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేస్తాం.

– సెప్టెంబర్‌ 18న ధ్వజారోహణం సందర్భంగా ముఖ్యమంత్రివర్యులు వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

– 2024 సంవత్సరం టీటీడీ క్యాలండర్లు, డైరీలను ముఖ్యమంత్రివర్యులు విడుదల చేస్తారు.

– బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా గరుడసేవనాడు విశేషంగా విచ్చేసే భక్తులకు సౌకర్యాల కల్పనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా, తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది.

– నేరుగా వచ్చి బ్రహ్మోత్సవాలను తిలకించలేని భక్తుల సౌలభ్యం మేరకు ఉదయం, రాత్రి వాహనసేవలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తాం.

– చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి లక్షిత కుటుంబానికి టీటీడీ ద్వారా గతంలో ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని నిర్ణయం.

– ఈ ఏడాది జరిగే శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మరింత మెరుగ్గా పారిశుద్ధ్య నిర్వహణకు గాను అదనంగా కార్మికులను ఏర్పాటు చేసుకునేందుకు రూ.32.73 లక్షలు మంజూరుకు ఆమోదం.

– చంద్రగిరి శ్రీ మూలస్థాన యల్లమ్మ ఆలయ పునర్నిర్మాణానికి రూ.2 కోట్లతో టెండరు ఆమోదం.

– ముంబయిలోని బాంద్రాలో రూ.1.65 కోట్లతో శ్రీ వేంకటేశ్వరస్వామివారి రెండో ఆలయం, రూ.5.35 కోట్లతో సమాచార కేంద్రం నిర్మాణానికి పరిపాలన ఆమోదం. ఈ మొత్తాన్ని టీటీడీ బోర్డు స‌భ్యులు విరాళంగా అందిస్తారు.

– రూ.49.48 కోట్లతో టీటీడీ ఉద్యోగుల 1476 క్వార్టర్ల మరమ్మతులు చేపట్టేందుకు ఆమోదం.

– రూ.33 కోట్లతో వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల కోసం కేటాయించిన స్థలంలో రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు ఆమోదం. ఈ మొత్తాన్ని ఉద్యోగులు తిరిగి టీటీడీకి చెల్లిస్తారు.

– తిరుపతిలోని టీటీడీ ఉద్యోగుల కాలనీలైన కేశవాయగుంట, భైరాగిపట్టెడ, వైకుంఠపురం, ఎల్‌ఎస్‌.నగర్‌లలో రూ.4.15 కోట్లతో రోడ్ల అభివృద్ధిపనులు చేపట్టేందుకు ఆమోదం.

– రూ.600 కోట్లతో తిరుపతి రైల్వేస్టేషన్‌ వెనుక వైపు గల 2, 3 సత్రాల స్థానంలో అచ్యుతం, శ్రీపథం వసతి సముదాయాల నిర్మాణానికి ఆమోదం.

– టీటీడీ ఆలయాల్లో అర్చకులు, పరిచారకులు, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లు కలిపి 413 పోస్టులు మంజూరు కోసం ప్రభుత్వానికి విన్నవించాలని నిర్ణయం.

– తిరుపతిలో నిర్మాణం కానున్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో 29 మంది స్పెషలిస్టు డాక్టర్లు, 8 మంది డ్యూటీ డాక్టర్లు, 15 మంది పాలనా సిబ్బంది, ఏడుగురు పారామెడికల్‌ సిబ్బంది, 241 మంది శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్‌ కార్పొరేషన్‌ సిబ్బంది కలిపి మొత్తం 300 మంది నియామకానికి ఆమోదం.

– టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల, తిరుపతిలోని ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో ఒక సంవత్సరానికి గాను మెడికల్‌, సర్జికల్‌, ల్యాబ్‌, ఎక్స్‌రే విభాగాలకు మందులతోపాటు ఇతర సామగ్రి కొనుగోలుకు రూ.2.46 కోట్లతో టెండరు ఆమోదం.

– టీటీడీ ఆధ్వర్యంలోని ధర్మగిరి, కీసరగుట్ట, విజయనగరం, ఐ.భీమవరం, కోటప్పకొండ, తెలంగాణలోని నల్గొండ వేద విజ్ఞానపీఠాలకు సంబంధించి అదనంగా 47 అధ్యాపక పోస్టుల మంజూరుకు ఆమోదం.

యాత్రికులకు మరిన్ని సదుపాయాలు

– తిరుపతికి వచ్చే లక్షలాది మంది యాత్రికులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి పలు నిర్ణయాలు తీసుకుంది.

– భక్తులు తిరుచానూరుకు సులువుగా చేరుకోవడం కోసం రేణిగుంట రోడ్డులోని నారాయణాద్రి కూడలి నుంచి తిరుచానూరు వైపు ఉన్న రోడ్డును నాలుగు వరసల 150 అడుగుల బైపాస్ రోడ్డు గా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల యాత్రీకులకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు, తిరుపతి నగరం మీద ట్రాఫిక్ ఒత్తిడి కూడా తగ్గుతుంది.

– తిరుపతి నగరంలోని శ్రీనివాసం వసతి సముదాయం పక్కన గల వైఎస్సార్ మార్గం నుంచి సామవాయి మార్గం వరకు రూ.9.60 కోట్లతో 40 అడుగుల రోడ్డు నిర్మాణానికి నిర్ణయం.

– తిరుచానూరు అమ్మవారి దర్శనం అనంతరం యాత్రికులు తిరుపతి నగరంలోని మంగళం ప్రాంతానికి సులువుగా చేరుకోవడానికి వీలుగా మంగళం రోడ్డులోని ఆర్టీవో కార్యాలయం కూడలి నుంచి రేణిగుంట రోడ్డులోని శ్రీ పద్మావతి ఫ్లోర్ మిల్ దాకా రూ.19.50 కోట్లతో 2.90కిలో మీటర్ల దూరం 80 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం.

-. యాత్రికులు ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా రేణిగుంట రోడ్డులోని హీరో హోండా షోరూమ్ నుంచి తిరుచానూరు రోడ్డులోని గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద బైపాస్ రోడ్డుకు చేరుకునేలా రూ.4 కోట్లతో 1.135 కిలో మీటర్ల మేరకు రోడ్డు నిర్మాణానికి అనుమతి.

– ఎండీ పుత్తూరు నుంచి మంగళం వద్ద గల పంపింగ్ స్టేషన్ వరకు 1100 ఎంఎం డయా వాటర్ పైప్ లైన్ ఏర్పాటుకు తిరుపతి నగరపాలక సంస్థకు వడ్డీ లేని రుణం మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల తిరుపతి నగరంలోని టీటీడీకి చెందిన స్విమ్స్, బర్డ్, ఆయుర్వేద, చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రి, చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, పద్మావతి మెడికల్ కాలేజీ ఇతర సంస్థలకు రాయితీ మీద ప్తస్తుతం రోజుకు 10 ఎంఎల్ డి నీరు సరఫరా చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల అదనంగా రోజుకు మరో 10 ఎంఎల్‌డితో కలిపి రోజుకు 20 ఎంఎల్‌డి నీరు 50 శాతం రాయితీతో అందిస్తారు.

– అలాగే స్విమ్స్, బర్డ్, ఆయర్వేద, చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రులు, శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీ ఇతర విభాగాల డ్రైనేజీ నీటి నిర్వహణ కోసం టీటీడీకి ప్రత్యేక డ్రైనేజి పైప్ లైన్ లేదు. దీనివల్ల ఎదురవుతున్న ఇబ్బందులు అధిగమించడానికి స్విమ్స్ సర్కిల్ నుంచి టౌన్ క్లబ్ మీదుగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వరకు నగరపాలక సంస్ధ ద్వారా డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణానికి నిర్ణయం.

టీటీడీ ప్ర‌తిష్ట‌ను మ‌రింత ఇనుమ‌డింప‌చేయాలి : ఛైర్మ‌న్

తిరుమ‌ల శ్రీ‌వారిని క్ష‌ణ కాలం ద‌ర్శించుకుంటే జీవిత‌కాల ఆనందం సొంత‌మ‌వుతుంద‌ని, అలాంటిది బోర్డు స‌భ్యులుగా అవ‌కాశం రావ‌డం మ‌హ‌ద్భాగ్యమ‌ని, ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని టీటీడీ ప్ర‌తిష్ట‌ను మ‌రింత ఇనుమ‌డింప‌చేయాల‌ని టీటీడీ ఛైర్మ‌న్  భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో నూత‌న బోర్డు తొలి స‌మావేశం ప్రారంభంలో స‌భ్యుల‌కు ఛైర్మ‌న్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ 17 ఏళ్ల క్రితం ఛైర్మ‌న్‌గా సేవ‌లందించాన‌ని, ఆనాడు చేసిన మంచి ప‌నుల‌కు గుర్తింపుగా మ‌రోసారి అవ‌కాశం వ‌చ్చింద‌ని భావిస్తున్నాన‌ని చెప్పారు. హైంద‌వ ధ‌ర్మ‌వ్యాప్తికి, స‌నాత‌న సంప్ర‌దాయాల‌ను కాపాడ‌డానికి, సంస్కృతిని ప‌రిర‌క్షించ‌డానికి టీటీడీ ఎంత‌గానో కృషి చేస్తోంద‌న్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న హిందువుల‌కు ఆధ్యాత్మిక అనుభూతిని అందించేందుకు, హైంద‌వ ధ‌ర్మానికి నాయ‌క‌త్వం వ‌హించేలా టీటీడీ ప‌నిచేస్తోంద‌న్నారు. ప్ర‌తి నిర్ణ‌యం ధ‌ర్మ‌ర‌క్ష‌ణ కోస‌మే తీసుకోవాల‌ని, ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను చ‌క్క‌గా నిర్వ‌హించాల‌ని కోరారు. అనంత‌రం గంట నిడివి గ‌ల టీటీడీకి సంబంధించిన డాక్యుమెంట‌రీని బోర్డు స‌భ్యుల కోసం ప్ర‌ద‌ర్శించారు.

శ్రీ ఉదయనిధి స్టాలిన్ విమర్శలపై ఖండ‌న‌

మీడియా ప్ర‌తినిధులు అడిగిన ఒక ప్ర‌శ్న‌కు ఛైర్మ‌న్ స‌మాధాన‌మిస్తూ సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి శ్రీ ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శలను ఖండించారు. సనాతన ధర్మం మతం కాదని, అదొక జీవనయానమని ఆయన చెప్పారు. ఈ విషయం తెలియక సనాతన ధర్మానికి కులాలను ఆపాదించి విమర్శలు చేయడం వల్ల సమాజంలో అలజడి చెలరేగే అవకాశం ఉంటుందన్నారు. ఇది విమర్శకులకు కూడా మంచిది కాదని  కరుణాకర రెడ్డి తెలిపారు.

ఈ స‌మావేశంలో దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  క‌రికాల‌వ‌ల‌వ‌న్‌, టీటీడీ ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్  స‌త్య‌నారాయ‌ణ‌, జెఈవోలు  స‌దా భార్గ‌వి,  వీర‌బ్ర‌హ్మం, బోర్డు స‌భ్యులు పాల్గొన్నారు.

Tags: Govinda crore to increase devotion in youth

Post Midle