ఉద్యోగులకు జీపీఎస్ పెన్షన్.. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
12వ పీఆర్సీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర
ఈ నెల 28న అమ్మఒడి నిధుల విడుదలతో పాటు.. జగనన్న ఆణిముత్యాలు పథకానికి ఆమోదం
ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం జగన్ ప్రభుత్వం వరాల జల్లు
జీపీఎస్ పెన్షన్ విధానం దేశానికే ఆదర్శం: మంత్రి చెల్లుబోయిన
తాడేపల్లి ముచ్చట్లు;
ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం జగన్ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. సీఎం జగన్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో బుధవారం నాడు జరిగిన క్యాబినెట్ భేటీలో ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ పెన్షన్ అమలు చేసేందుకు, వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేసేందుకు ఏపీ క్యాబినెట్ పచ్చ జెండా ఊపి ఉద్యోగుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. దీంతో పాటు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 5 కీలక సిఫారసులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ జరిగింది. ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుని మొత్తం 63 ఆంశాలకు ఆమోద ముద్రవేశారు. ఆ వివరాలని సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వివరించారు.”ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ విధానంపై బిల్లు రూపకల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా.. ఏపీ గ్యారెంటీడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో ఒకటైన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగుల కోసం సీపీఎస్ ను రద్దు చేసి దాని స్థానంలో ఏపీ జీపీఎస్(గ్యారెంటెడ్ పెన్షన్ స్కీం) బిల్లును అమలులోకి తీసుకురానున్నారు. మరి ముఖ్యంగా 10 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 12వ పీఆర్సీ ఏర్పాటు మరియు కొత్త జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్ఆర్ఏ 12 శాతం నుంచి 16 శాతానికి పెంపున అంగీకారం తెలిపిన కేబినెట్.. జగనన్న అమ్మ ఒడి పథకాన్ని జూన్ 28వ తేదీన అమలుకు నిర్ణయం తీసుకుంది” అని మంత్రి చెల్లుబోయిన తెలిపారు.
ఇవే కాకుండా.. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో ఎంఓయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపునకు కేబినెట్ ఆమోదం ముద్ర వేశారని మంత్రి పేర్కొన్నారు. 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్ల బిగింపునకు రూ. 6,888 కోట్ల వ్యయం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం రూ. 445 కోట్ల రుణాల కోసం ఏపీఎఫ్ఎస్ఎల్ కు కెబినెట్ అనుమతినిచ్చిందని చెప్పారు. రాష్ట్రంలోని కొత్త మెడికల్ కళాశాలలకు 706 పోస్టుల భర్తీకి, ఖాళీగా ఉన్న గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి కూడా పచ్చజెండా ఊపారన్నారు. చిత్తూరు డైరీ ప్లాంటుకు చెందిన 28 ఎకరాల భూమినీ 99 ఏళ్లు లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు కేబినెట్ అంగీకారించిందని, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా రూ. 5 వేల కోట్ల రుణ సేకరణకు కూడా అనుమతినిచ్చిందని వెల్లడించారు. జూన్ 12 నుంచి 17 వరకూ జగనన్న విద్యా కానుక వారోత్సవాలు నిర్వాహించేదుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు అవార్డులు ప్రదానం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
“ఆంధ్ర యువతకు తీపి కబురు. 6,840 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదించింది. అందులో పోలీస్ బెటాలియన్ 3,920.. కొత్త మెడికల్ కాలేజీల్లో 2,118 సహా మరి కొన్ని శాఖల్లో పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. మన పిల్లలు దేశవిదేశాల్లో రాణించేందుకు 3వ తరగతి నుంచి 9వ తరగతి కమ్యునికేషన్స్ పెంపునకు TOEFL ద్వారా శిక్షణనిస్తాం” అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు.ఇక, ఒడిశా మృతులకు కేబినెట్ సంతాపం తెలిపినట్టు వెల్లడించారు. బాధితుల కోసం 50 అంబులెన్స్లు పంపించినట్లు మంత్రి చెల్లుబోయిన తెలిపారు. మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియాకు ఆమోదం తెలిపిందన్నారు. అనంతపురం, సత్యసాయి జిల్లాలో విండ్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్టు స్పష్టం చేశారు. నాడు-నేడు కింద పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నైట్ వాచ్మెన్ పోస్టులకు ఆమోదం లభించిందన్నారు.
రూ. 5లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాలను కమిటీలకు అప్పగించాలని, ఈ ఆలయాల నిర్వహణ బాధ్యత అర్చకులదేనని ఐదేళ్ల పాటు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. పాడి రైతులకు సరైన ధర కల్పించామని, నేటికి పాల సేకరణ పెరిగిందని, పాల ధర కూడా పెరిగిందని, అమూల్ రావడం వల్ల పాడి రైతులకు మేలు జరిగిందని అన్నారు.అంతేకాకుండా కో -ఆపరేటివ్ సొసైటీల్లో సూపర్ న్యూమరీ పోస్టుకు, ఇంకా కడప మానసిక వైద్య శాలలో 116 పోస్టులకు, 476 గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో నైట్ వాచ్మెన్ పోస్టులకు, పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లోని డయాలసిస్ యూనిట్కు 41 మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి చెల్లుబోయిన తెలిపారు. అగ్రి కల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఈఈ పోస్టును ఈఈగా అప్ గ్రేడ్ చేసినట్లు చెప్పారు. ఉద్యోగులందరికి ఏరియర్స్ తో 2.73శాతం డీఏకు ఆమోదం తెలిపినట్టు స్పష్టం చేశారు.
అలాగే.. పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను వేగవంతం చేయడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఏపీ పునర్విభజన చట్టం కింద పెండింగ్లో ఉన్న సమస్యలు, రెవెన్యూ లోటుతో పాటు పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయడం, ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతి వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించిందని పేర్కొన్నారు.
Tags:GPS pension for employees. AP Cabinet green signal for regularization of contract employees