మే 14 నుండి 18వ తేదీ వరకు తిరుమలలో హనుమజ్జయంతి ఉత్సవాలు- జేఈవో సదా భార్గవి
– ఆకట్టుకునేలా ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు
తిరుమల ముచ్చట్లు:

తిరుమలలో మే 14 నుండి 18వ తేదీ వరకు జరగనున్న హనుమజ్జయంతి ఉత్సవాలలో భక్తులను ఆకట్టుకునేలా ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జేఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో సోమవారం జేఈవో తన ఛాంబర్లో అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, అంజనాద్రి ఆకాశ గంగ, నాద నీరాజనం వేదికలపై ప్రతిరోజు అన్నమాచార్య, దాససాహిత్య, హెచ్డిపిపి ప్రాజెక్టుల కళాకారులచే ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శ్రీ హనుమంతుని జన్మ విశేషాలపై ప్రముఖ పండితులతో ప్రసంగాలు ఏర్పాటు చేయాలన్నారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత వర్సిటీ, ఎస్వీ ఉన్నత వేద అధ్యయన సంస్థకు చెందిన వేదపండితులతో కార్యక్రమాలు రూపొందించాలన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని ఎస్వీ బీసీ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.ఎస్వీ బీసీ సిఈవో షణ్ముఖ్కుమార్, వేద వర్సిటీ విసి ఆచార్య రాణిసదాశివమూర్తి, సంస్కృత విశ్వవిద్యాలయం విసి ఆచార్య కృష్ణమూర్తి, హెచ్డిపిపి సెక్రటరీ శ్రీనివాసులు, హిందు ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజగోపాల్, అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ విభీషణ శర్మ, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
Tags: Hanumajjayanthi celebrations in Tirumala from 14th to 18th May- JEO Sada Bhargavi
