అలుగుల కోసం వేట..
ఏలూరు ముచ్చట్లు:
అడవికి రాజు సింహం… అది ఎంతటి జీవినైనా వేటాడి నమిలేస్తుందని నమ్ముతాం… కానీ, సింహం కూడా తినలేనంత గట్టిగా ఉండే అరుదైన వన్యప్రాణులు ఉన్నాయి. అటువంటి వాటిలో అడవి అలుగు ఒకటి. అలుగు వీపుపై ఉండే పెంకులు కత్తిలాగా పదును కలిగి ఉంటాయి. ఇవి సింహం కూడా నమలలేనంత గట్టిగా ఉంటాయి. అటువంటి అరుదైన అడవి అలుగులు ఏలూరు జిల్లా పరిధిలోని పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో గల పాపికొండల అభయారణ్యంలో సంచరిస్తున్నాయి. వీటిని పాంగోలిన్ అని కూడా పిలుస్తారు.చైనీస్ పాంగోలిన్, ఏషియా పాంగోలిన్, సుండా పాంగోలిన్, పాతమాన్ పాంగోలిన్ అని నాలుగు రకాల అలుగులు ఉంటాయి. వీటి మూతి ముంగిసను పోలి ఉంటుంది. నాలుగు కాళ్లతో ఉండే ఈ అలుగు సుమారు 20 ఏళ్లు జీవిస్తుంది. చీమలు, పురుగులను ఆహారంగా తీసుకుంటుంది. ఎక్కువ శాతం దట్టమైన అడవి, అధికంగా వర్షాలు కురిసే ప్రాంతాలతోపాటు ఎడారి ప్రాంతాల్లో ఇవి జీవనం సాగిస్తుంటాయి.
తొలిసారిగా 1821లో ఈ జంతువుల సంచారాన్ని గుర్తించినట్లు వైల్డ్ లైఫ్ అధికారులు తెలిపారు. అరుదైన ఈ వన్యప్రాణులు పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో సుమారు 20 వరకు సంచరిస్తున్నాయని వెల్లడించారు. అలుగులు పగలు కంటే రాత్రి సమయంలోనే ఎక్కువగా సంచరిస్తుంటాయి. అలికిడి అయితే అవి బెదిరి కదలకుండా గట్టిగా బంతిలా ముడుచుకుని ఉండిపోతాయి. వీటికి ఎదురు దాడి చేసే గుణం కూడా ఉంటుంది. ఇవి రెండేళ్లకు ఒకసారి పిల్లలకు జన్మనిస్తాయి. కోతి మాదిరిగానే తన పిల్లలను వీపుపై ఎక్కించుకుని తిప్పుతూ పోషిస్తాయి. అలుగు పెంకులను చైనాలో మందుల తయారీకి ఉపయోగిస్తారని అధికారులు తెలిపారు. వీటికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, ఒక్కో అలుగు రూ.20లక్షల వరకు ధర పలుకుతోందని చెప్పారు.
Tags: Hunting for cracks..