కరీంనగర్ లో ‘వేదిక వాచస్పతి’ అవార్డు ప్రధానం
కమాన్ పూర్ ముచ్చట్లు:
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యాఖ్యాత, స్థానిక కళాకారులు మేజిక్ రాజా మకుటంలో మరో కలికితురాయి చేరింది. అవార్డుల రారాజు మేజిక్ రాజా మంగళవారం మరో అవార్డును అందుకున్నారు. ప్రపంచ జానపద కళల దినోత్సవం, కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కరీంనగర్ ఫిలిం భవన్ లో నిర్వహించే కార్యక్రమంలో మేజిక్ రాజాకు ‘వేదిక వాచస్పతి’ అవార్డును ప్రదానం చేసారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హాజరైన నాలుగు బహిరంగ సభలకు రాజా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కవి,
తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిధారెడ్డి రచనలో రవీంద్ర భారతిలో ప్రదర్శితమైన మూడు నృత్య రూపకాలకు వ్యాఖ్యాతగా సాహితీవేత్తలను, కళాభిమానులను అలరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనేగాక ఉత్తరాఖండ్ లోని హరిద్వార్, మహారాష్ట్రలోని ముంబయ్ లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో కళా ప్రదర్శనలేగాక, రాజా వ్యాఖ్యాతగా వ్యవహరించి రక్తి కట్టించారు. కాగా రాజా అవార్డుకు ఎంపిక కావడం పట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెజీషియన్స్ అసోసియేషన్, స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్, రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం, తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నియర్ అండ్ డియర్, గోదావరి సరిగమల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ రాజాకు అభినందనలు తెలిపారు.

Tags: In Karimnagar, ‘Vedika Vachaspati’ award is the main one
