పెరుగుతున్న దూరం… మరింత భారం
హైదరాబాద్ ముచ్చట్లు:
కొద్ది రోజుల క్రితం హైకోర్టు సీజే ప్రమాణ స్వీకార సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇంచుమించుగా సంవత్సర కాలం తర్వాత, రాజ్ భవన్ లో కాలు పెట్టారు. అంతకు ముందు ఏమి జరిగింది, ముఖ్యమత్రి, గవర్నర్ మధ్య దూరం అంతలా దూరం ఎందుకు పెరిగింది అంటే అదంతా ఇప్పుడు చరిత్ర. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య విభేదాలు ఏ స్థాయికి చేరాయో, రాజ్ భవన్ ప్రగతి భవన్ మధ్య దూరం ఎంతలా పెరిగిందో ఇప్పుడు వేరే చెప్పవలసిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ నిబంధనలను పాటించడం లేదని, గవర్నర్ పలుమార్లు ఆరోపించారు. అంతే కాదు, తెలంగాణలో గవర్నర్ వ్యవస్థకు జరుగతున్న అవమానాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. మంత్రులు, తెరాస నాయకులు కూడా గీతదాటి గవర్నర్ వ్యవస్థను ఏవిధంగా చిన్న చూపు చూస్తోంది వివరించారు. అందుకు తగ్గట్టుగానే, రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే, గవర్నర్ ప్రోటోకాల్ పాటించలేదనే విషయం కళ్ళముందే కనిపిస్తోంది. రాజ్ భవన్ ప్రాంగణంలో జరిగిన రాష్ట్ర హై కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రులు హాజరయ్యారు. అంతే కాదు, గవర్నర్, ముఖ్యంత్రి మధ్య అసలు ఎలాంటి విభేదాలు లేవన్నట్లుగా కనిపించారు.ముఖ్యమంత్రి గవర్నర్’తో మాట కలిపారు. దీంతో ఈ ఇద్దరి మధ్య‘ మంచు కరిగింది’, విభేదాలు తొలిగి పోయాయి, అనే ప్రచారం జరిగింది.
అదేమీ లేదని స్వయంగా గవర్నర్ తమిళిసై మరోమారు దేశ రాజధాని ఢిల్లీలో స్పష్తం చేశారు. స్పష్టం చేయడం కాదు, ముఖ్యమంత్రి పై ఆమె భగ్గుమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ కుట్ర వ్యాఖ్యలపై తాను బరస్ట్ కానంటూనే, ముఖ్యమంత్రిపై ముందెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలను సంధించారు. నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన ఆమె ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. అందులో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగానే అయినా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం తర్వాత కూడా ముఖ్యమంత్రిలో, రాష్ట్ర ప్రభుత్వ ధోరణిలో మార్పు రాలేదని, గవర్నర్ వ్యవస్థను ఇంకా చులకనగానే చూస్తున్నారని అన్నారు. అంతే కాదు, ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా, ముఖ్యమంత్రి కేసీఆర్ కు జాతీయ రాజకీయాల్లో చోటు లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే, ముఖ్యమంత్రికి పరోక్షంగా సవాలు కూడా విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అవరోధాలు కలిపించినా, ప్రోటోకాల్ పాటించక పోయినా, తాను ప్రజల్లోనే ఉంటానన్నారు. అదలా, ఉంటే, ముఖ్యమంత్రి ఢిల్లీలో అడుగుపెడుతున్న సమయంలో గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఢిల్లీలో,రాష్ట్రంలోనూ చర్చనీయాంశమవుతున్నాయి. అంతే కాదు, గవర్నర్ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేయడం ఇద్దరి మధ్య దూరం తగ్గలేదనే కాదు, తగ్గదని కూడా స్పష్టం చేస్తున్నాయని, అంటున్నారు.

Tags: Increasing distance…more burden
