టీటీడీ పరిపాలనా భవనంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
– 30 మంది అధికారులు, 219 మంది ఉద్యోగులకు శ్రీవారి వెండి డాలర్, ప్రశంసాపత్రం
– ఆకట్టుకున్న అశ్వ విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు
తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్ మైదానంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవిఎస్వో కె.శైలేంద్రబాబు పెరేడ్ కమాండర్గా వ్యవహరించారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమసేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 30 మంది అధికారులు, 219 మంది ఉద్యోగులకు, ఎస్వీబీసీలో ఏడుగురు ఉద్యోగులకు ఐదు గ్రాముల శ్రీవారి వెండి డాలర్, ప్రశంసాపత్రం అందజేశారు. అదేవిధంగా ఉద్యోగుల పిల్లలకు సంబంధించి ఇంటర్లో ప్రతిభ కనబరిచిన 26 మంది విద్యార్థులకు 2,116/-, 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన 32 మంది విద్యార్థులకు 1,116/- నగదు బహుమతులు అందజేశారు.
టీటీడీ నిఘా మరియు భద్రత విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జాగిలాల ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. జాగిలం బొకే అందించడం, ఫైర్ జంప్, హై జంప్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ఎన్.సి.సి విద్యార్థుల అశ్వ విన్యాసాలు అలరించాయి. మాపెల్, గుడ్ లక్, అలీవర్, రాణీ ఝాన్సీ పేర్లు గల అశ్వాల రైడింగ్, హైజంప్ ఆకట్టుకున్నాయి.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థినులు “భరతఖండమే నా దేశం…..”, ” వందేత్వం భూదేవి…”, “తంబూరి మీటెదవా…..” తదితర దేశభక్తి, ఆధ్యాత్మిక గీతాలకు చక్కటి నృత్యం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా|| వి.కృష్ణవేణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. స్వాతంత్ర్య వేడుకల్లో ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవోలు సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం,
ఎస్వీ బీసీ సిఈవో షణ్ముఖ్ కుమార్, సిఏఓ శేషశైలేంద్ర, డిఎల్ వో
వీర్రాజు, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజి, సిఈ నాగేశ్వరరావు, అదనపు సివిఎస్వో శివ కుమార్ రెడ్డి అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Tags:Independence Day celebration at TTD administration building
