జనాభాలో చైనాను అధిగమించిన భారత్..!
దిల్లీ ముచ్చట్లు:
ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన చైనా(China)లో జననాల రేటు తగ్గినట్లు ఇటీవల నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చైనా జనాభాను భారత్ ఇప్పటికే దాటేసి ఉండవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.వరల్డ్ పాపులేషన్ రివ్యూ (WPR) అంచనాల ప్రకారం.. 2022 చివరినాటికే భారత్ జనాభా 141.7కోట్లు కాగా తాజాగా (జనవరి 18, 2023 నాటికి) ఈ సంఖ్య 142.3 కోట్లుకు చేరుకున్నట్లు అంచనా. మరో అంతర్జాతీయ మార్కెట్ పరిశోధక సంస్థ మాక్రోట్రెండ్స్ (Macrotrends) కూడా ప్రస్తుతం భారత జనాభా 142.8కోట్లుగా లెక్క కట్టింది. ఇవి చైనా ఇటీవల ప్రకటించిన జనాభా (141.2కోట్లు) కంటే ఎక్కువ. దీంతో ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్ (India) అవతరించినట్లేనని స్పష్టమవుతోంది.

జననాల రేటు తగ్గుతుండటం.. వయోవృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తమ జనాభా ఇటీవలి కాలంలో తొలిసారిగా తగ్గినట్లు చైనా (China) ప్రకటించింది. 2021 కంటే 2022 చివరినాటికి తమ దేశ జనాభా 8.50 లక్షలు తగ్గిందని అక్కడి నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) జనవరి 17న తెలిపింది. ప్రస్తుతం అక్కడ మొత్తం జనాభా 141.18 కోట్లుగా ఖరారు చేసింది. అయితే, భారత్ 2023 చివరి నాటికి ఈ రికార్డును చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి (UN) ఇదివరకు అంచనా వేసినప్పటికీ.. అంతకుముందే భారత్ ఈ రికార్డును అధిగమించినట్లు తెలుస్తోంది. 2050 నాటికి భారత జనాభా సుమారు 167 కోట్లకు చేరుకోవచ్చని ఐరాస అంచనా వేస్తోంది.
మరోవైపు ప్రపంచ జనాభా కూడా ఇటీవలే 800 కోట్ల మైలురాయిని దాటింది. 2022 నవంబర్ 15 రోజున పుట్టిన శిశువుతో జనాభా 800 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 1974లో ప్రపంచ జనాభా 400 కోట్లుగా ఉండగా.. 48ఏళ్లలోనే అది రెట్టింపై 800 కోట్లకు చేరుకుంది. వైద్యం సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన పురోగతి వల్ల అకాల మరణాలు తగ్గడం, ఆయుర్దాయం పెరగడం జనాభా పెరుగుదలకు ప్రధాన కారణమని ఐరాస వెల్లడించింది.
Tags: India has surpassed China in population..!
