రాహుల్ తో భేటీ తర్వాత… గతంలో నేను చెప్పిన విషయాలన్నీ మర్చిపోయా: జగ్గారెడ్డి
దిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మెస్సేజ్ విన్న తర్వాత గతంలో తాను చెప్పిన విషయాలన్నీ మర్చిపోయానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో కుటుంబ సభ్యులతో కలిసి జగ్గారెడ్డి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…” తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారానికి తెరాస ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. తెరాస, భాజపా, ఎంఐఎంలను ఏవిధంగా నిలదీయాలి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలా పోరాడాలనే దానిపై రాహుల్ చర్చించారు. 3 పార్టీలను ఎదుర్కోవాలని రాహుల్ దిశానిర్దేశం చేశారు. రాహుల్ తో మాట్లాడిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న విభేదాలన్నీ మర్చిపోయా. అప్పుడు చెప్పిన విషయాలేవీ గుర్తులేవు. కాంగ్రెస్ ను గెలిపించేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేస్తాం. రాష్ట్రంలో మా మధ్య ఎలాంటి విభేదాలు ఉండవు. కలిసికట్టుగా ఎలా పనిచేస్తామో మీరే చూస్తారు” అని జగ్గారెడ్డి అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్ గాంధీ తో ఫొటో దిగడం ఆనందంగా ఉందని, అందుకే ఢిల్లీ వచ్చామని వివరించారు..