జనవరి 10.. గానగంధర్వుడు కె.జె.యేసుదాసు జన్మదినం
విజయవాడ ముచ్చట్లు:
ఒక రోమన్ క్యాథలిక్ మిషనరీ స్కూల్లో క్లాసు చెబుతున్న ఒక టీచర్ “ప్రపంచంలో ఒక్క క్ర్రెస్తవులు మాత్రమే స్వర్గానికెళుతార”ని భోదిస్తున్నారు. అది విన్న ఒక బాలుడు పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళి “నాన్నా క్ర్రెస్తవులు మాత్రమే స్వర్గానికి వెళతారంటకదా!! నాకున్న స్నేహితులందరూ హిందువులే. మరి స్వర్గంలో నేను ఎవరితో ఆడుకోవాలి” అని అడిగాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఆ అబ్బాయి తల నిమురుతూ” నువ్వు అన్ని మతాలనూ సమానంగా చూడు… అందరూ నీతోనే వుంటారన్నాడు.. తన తండ్రి మాటను తూ. చా తప్పకుండా పాటించాడు ఆ కుర్రాడు. ఒకేజాతి, ఒకే మతం, ఒకే దేవుడన్న నారాయణగురు బోధనతో ప్రభావితమై ఈనాటికీ ఆ సిద్దాంతాలను పాటించడమేగాక ప్రజలను సైతం పాటలరూపంలో చైతన్యపరుస్తున్నాడు..అతడే… అపర గానగంధర్వుడు, కె. జే. యేసుదాసు..భారతీయ సంగీతప్రపంచంలో ఈయన పేరు తెలియని వారుండరంటే, అతియోక్తిలేదు. 1940 జనవరి 10 న ఒక పేదకుంటుంబంలో జన్మించారు. నాన్న అగస్టీన్ జోసఫ్, తల్లి ఆలిన్ కుట్టి.. అగస్టీన్ మంచి శాస్త్రీయసంగీత విద్వాంసుడు.. అందుకే దాసుగారి మొదటి గురువు ఆయనే!! దాసు కంఠస్వరం చాలా గంభీరంగా విలక్షణంగా ఉండేది. ఆయన గొంతువిని అప్పటి గొప్పసంగీత విద్వాంసులైన సెమ్మగుడి శ్రీనివాసన్ , కె.ఆర్ కుమార్ స్వామి వంటి వారు తమ శిష్యునిగా చేసుకున్నారు.

అయితే చెంబై వైద్ధ్యనాథన్ భాగవతార్ అనే గాయకుడు దాసుని మంచి సంగీతకారుడిగా తీర్చిదిద్దారు. తన శిష్యుని కోసం గురువాయూర్ దేవస్థానకమిటీనే ధిక్కరించారు వైధ్యనాధన్
అప్పట్లో కేరళలోని ప్రతిగ్రామంలో దాసుగారి కచేరి జరిగిందట.. అయితే 1961 నవంబరు 14 ఒక మళయాళ సినిమాకు పాట పాడటం ద్వారా సినీరంగప్రవేశము చేసిన దాసు ఇంక వెనుకతిరిగిచూడలేదు.. తెలుగులో ‘అంతులేని కథ’ సినిమాలో పాడిన “దేవుడే ఇచ్చాడు… వీధి ఒక్కటి” అనే పాటతో, తమిళ, తెలుగు సినీ పరిశ్రమలలో ఆయనకు ఎదురులేకుండా పోయింది. బాలు లాంటి సింగరే మూడు సంవత్సరాలు ఇబ్బంది పడ్డారంటే ఆయన ప్రతిభ అర్థం చేసుకోవచ్చు!!1976లో హిందీలో రవీంద్రజైన్ సంగీతసారథ్యంలో వచ్చిన” చిత్ చోర్” సినిమాలో యేసుదాసు గారు పాడిన “గొరితెర గావ్ బడా ప్యారా.. మైతోగయా మారా.. ఆకే యహారే..” పాట భారత్ అంతా మారుమ్రోగింది… దీనితో హిందీ గాయకులందరూ సంఘటితమై ఆయనచేత పాట పాడిస్తే మేము పాడమనే స్తాయికి వచ్చారు!! రవీంద్రజైన్ గారు పుట్టుకతోనే అంధుడు. ఆయన ఏమనేవాడంటే… “దేవుడు ఒకసారి నాకు కనుచూపు ప్రసాధిస్తే యేసుదాసు రూపం చూసి తరిస్తాను.” అన్నారట. ఇది చాలు యేసుదాసుగారి గొప్పతనం చెప్పడానికి!!
నువ్వు క్ర్రెస్తవుడివై వుండీ పరదేవుళ్ళను స్తుతిస్తూ పాటలు పాడినందుకు ఆ మతపెద్దలు ఆయనను వెలివేసినప్పుడు… “నేను కళాకారుడిని, నాకు అన్ని మతాలు అవసరమని బదులిచ్చాడు!!1971లో ఇండోపాక్ యుద్ధం జరుగుతున్నప్పుడు వీధి,వీధి తిరిగి సంగీతకచేరిలు చేసి, వచ్చిన విరాళాలు ఇందిరాగాంధీకి ఇచ్చిన దేశభక్తుడు ఆయన!! మనదేశంలో ఒక్క కాశ్మీరీ,అస్సామీ భాషలలో తప్ప మిగతా అన్ని భాషలలోనూ పాటలు పాడిన ఘనత ఈయనగారిదే!! ఇవే కాకుండా మలేసియన్, రష్యన్, అరబిక్, లాటిన్, ఇంగ్లీషుభాషలలో సహితం పాటలుపాడి శ్రోతలను అలరించారు.. కొన్ని పాటలైతే యేసుదాసు కంఠంతోనే వినాలనిపించేంతగా ప్రజలు విశ్వసిస్తారంటే అతిశయోక్తికాదు!! ఆయన గొప్పతనం ఏమిటంటే.. ఆయన పాడిన ‘హరివరాసనం’ అనే పాట అయ్యప్పస్వామిని నిద్రపుచ్చేపాటగా ట్రావెన్ కోర్ దేవస్థానం తీసుకుంది, అలాగే మేలుకొలుపుపాట కూడా ఆయనదే!! ఇప్పటి వరకు ఆయన 40000 పాటలు పాడారు!!ఆయన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ… ఆయనకు మంచి ఆరోగ్యము, ప్రశాంత జీవనమును ప్రసాదించాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను!!
Tags; January 10.. Ganagandharva K.J.Yesudasa’s birthday
