రాజశ్యామల యంత్రపూజలో కేసీఆర్ దంపతులు
– స్వరూపానందేంద్రతో కలిసి యాగశాల చుట్టూ ప్రదక్షిణ
– తెలంగాణ శ్రేయస్సు కోసం యజుర్వేద పండితులచే ఘనస్వస్తి
ఎర్రవల్లి ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం శాస్త్రోక్తంగా కొనసాగింది. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రమంతా రాజశ్యామల అమ్మవారి మూల మంత్రాలతో మార్మోగుతోంది. వేద మంత్రోచ్ఛారణల మధ్య యాగం నిర్విఘ్నంగా సాగింది. గుతోంది. గురువారం రెండో రోజు యాగశాలలో రాజశ్యామల అమ్మవారు శివకామసుందరీ దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారి అవతారానికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు ప్రత్యేక హారతులు ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు రాజశ్యామల యంత్రానికి, సుబ్రహ్మణ్య షడావరణ యంత్రానికి పూజలు చేసారు. పండితులు 11 సార్లు శూలినీ దుర్గ కవచ పారాయణ చేసారు. సర్వ లోక సంరక్షణార్ధం ఇంద్ర సూక్త హోమం, నవగ్రహ సూక్త హోమం కూడా నిర్వహించారు. మరోపక్క షడావరణ సహిత మూల మంత్రాలతో సుబ్రహ్మణ్య కవచ యాగం చేపట్టారు. ఉదయాన్నే యాగశాలకు చేరుకున్న కేసీఆర్ దంపతులు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలతో కలిసి యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేసారు. అనేక ఆధ్యాత్మిక అంశాలపై పండితులతో చర్చించారు. స్వరూపానందేంద్ర స్వామి స్వహస్తాలతో సాగిన రాజశ్యామలా చంద్రమౌళీశ్వరుల నిత్య పీఠార్చనకు హాజరైన కేసీఆర్ దంపతులు తీర్థ ప్రసాదములను స్వీకరించారు. రాష్ట్ర శ్రేయస్సును కాంక్షిస్తూ యజుర్వేద పండితులు ఘనస్వస్తి పలికారు. యాగం ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ పర్యవేక్షిస్తుండగా, కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత యాగంలో పాల్గొన్నారు.రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం శుక్రవారంతో ముగిసింది. ఉదయం 11.10 గంటలకు పూర్ణాహుతికి ముహూర్తం నిర్ణయం నిర్ణయించారు. పూర్ణాహుతి సమయంలో పాటించాల్సిన నియమాలపై స్వరూపానందేంద్ర స్వామి పండితులతో చర్చించారు. ఈ యాగంలో మూడు లక్షలకు పైగా రాజశ్యామల అమ్మవారి మూల మంత్రాలను హవనం చేసారు. యాగంలో తెలంగాణతో పాటు తమిళనాడు, ఏపీ, కర్నాటక రాష్ట్రాలకు చెందిన 170 మంది ఉద్ధండులైన పండితులు పాల్గొన్నారు.

Tags:KCR couple at Rajshyamala Yantra Puja
