కిం… కర్తవ్యం…జగన్ ఆచితూచి అడుగులు
హైదరాబాద్ ముచ్చట్లు:
జనసేనాని అనుకున్నది సాధించారా? ఏపీలో జగన్ పార్టీకి బీజేపీని దూరం చేయడం, అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి చేరువ చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల నివ్వను అన్న తన మాటను నిలబెట్టుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. జనసేన అధినేత తన పంతం నెగ్గించుకున్నారా? ఏపీలో జగన్ సర్కార్ ను గద్దెదించడమే లక్ష్యం అని ప్రకటించిన ఆయన అందుకోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయను అని పంతం పట్టారుబీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడి ఒప్పిస్తానని కూడా చెప్పారు. ఈ మాట ఆయన ఎప్పుడో చెప్పారు. ఆ తరువాత పదేపదే పునరుద్ఘాటించారు. అయితే ఆయన మాటలు గాలి మూటలేనా అనిపించేలా ఇటీవలి ఆయన హస్తిన పర్యటనకు ముందు వరకూ రాష్ట్ర బీజేపీ నేతల తీరు ఉండింది. దీంతో ఏపీలో రాజకీయ సమీకరణాలపై పలు సందేహాలు ఉండేవి. ఒక వైపు ఏపీలో జగన్ సర్కార్ కు కేంద్రంలోని బీజేపీ సర్కార్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంటే.. మరో వైపు రాష్ట్రంలో ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన జగన్ సర్కార్ పై నిప్పులు చెరుగుతూ ఉండేది. ఈ పరిస్థితుల్లో జనసేన, బీజేపీల మైత్రి విచ్ఛిన్నం కావడం ఖాయమన్న అభిప్రాయమే సర్వత్రా ఉండింది. ఈ నేపథ్యంలోనే పలు మార్లు జనసేనాని బీజేపీ తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీని, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను బీజేపీ రాష్ట్ర నాయకత్వం కానీ, కేంద్రంలోని అగ్రనాయత్వం కానీ ఈ నాలుగేళ్లలో పెద్దగా పట్టించుకున్న దాఖలాలూ నిన్న మొన్నటి దాకా కనిపించలేదు.
అయితే తాడో పేడో తేల్చుకోవడానికి అన్నట్లుగా పవన్ కల్యాణ్ ఇటీవల రెండు రోజులు హస్తిన లో మకాం వేసి మరీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో చర్చలు జరిపి వచ్చారు. ఆ సందర్భంగా హస్తిన వేదికగా పవన్ కల్యాణ్ విలేకరులతో మాట్లాడారు. అప్పుడు కూడా పొత్తుల గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. బీజేపీ తన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిందన్న ఒక్క మాటతో సరిపెట్టేశారు. నడ్డాతో భేటీ తరువాత సంయుక్తంగా మీడియా ముందుకు రాకపోవడం, జగన్, నాదెండ్ల ఇరువురు మాత్రమే తప్పదన్నట్లుగా హస్తినలో మీడియాతో మాట్లాడటం, అదీ ముక్తసరిగా సరిపెట్టేయడంతో బీజేపీ ఏపీలో తెలుగుదేశం, జనసేనలతో కూటమిగా ఏర్పడేందుకు విముఖత చూపిందన్న విశ్లేషణలు వెల్లువెత్తాయి. అయితే పవన్ కల్యాణ్ హస్తిన పర్యటన తరువాత బీజేపీ కేంద్ర నాయకత్వంలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. అలాగే రాష్ట్ర నాయకత్వ గళం కూడా మారింది. అంతకు ముందులా రాష్ట్రంలో అధికార వైసీపీ పట్ల సానుకూలత తగ్గినట్లు స్పష్టంగా గోచరిస్తోంది. అలాగే.. వైసీపీ సర్కార్ విధానాలపై బీజేపీ రాష్ట్ర సర్కార్ విమర్శల దాడి పెంచడం చూస్తుంటే..

పవన్ కల్యాణ్ హస్తిన పర్యటన తరువాత వైసీపీ సర్కార్ పట్ల బీజేపీ వైఖరి మారినట్లుగా స్పష్టమౌతోంది.అన్నిటికీ మించి వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి వద్దకు సీబీఐ వస్తోందన్న భావన కలిగితే చాలు ఏపీ సీఎం జగన్ అన్ని కార్యక్రమాలూ రద్దు చేసుకుని హస్తినలో వాలిపోయేవారు. ఈ సారి ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రిని సీబీఐ అరెస్టు చేసినా.. అవినాష్ రెడ్డిని విచారణకు రావాల్సిందిగా ఐదో సారి సమన్లు జారీ చేసిన జగన్ తన పర్యటనలైతే రద్దు చేసుకున్నారు కానీ.. హస్తిన బాట పట్టలేదు. అలాగే సీబీఐ భాస్కరరెడ్డిని అరెస్టు చేయడం, అవినాష్ రెడ్డిని ఐదో సారి విచారించేందుకు నోటీసు ఇవ్వడం, ముందస్తు బెయిలు కోసం అవినాష్ పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ స్పష్టంగా అవినాష్ ను అవసరమైతే అరెస్టు చేస్తామని చెప్పడం చూస్తుంటే.. సీబీఐ దూకుడును అడ్డుకునే ప్రయత్నాలేవీ కేంద్రం నుంచి జరగడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద పవన్ హస్తిన పర్యటన ఒకే దెబ్బకు రెండు పిట్లలు అన్నట్లుగా వైసీపీకి బీజేపీని దూరం చేయడమే కాకుండా… తెలుగుదేశం కు దగ్గర చేర్చేందుకు దోహదపడిందని అంటున్నారు.
Tags:Kim… Duty…Jagan steps forward
