Natyam ad

తెలుగుదేశం గూటికి కోటంరెడ్డి..?

నెల్లూరు ముచ్చట్లు:


నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడి బయటకు వెళ్లిపోతున్నారా..? పార్టీని వీడుతున్నట్టు ఆయన ప్రకటన చేయడానికి ముందే వైసీపీ అక్కడ ఇన్ ఛార్జ్ ని ప్రకటిస్తుందా..? ఈ రెండిటిలో ఏదో ఒకటి ముందు జరుగుతుంది, కానీ ఏది జరుగుతుందో స్పష్టత రావాల్సి ఉంది. అంటే దాదాపుగా కోటంరెడ్డికి వైసీపీతో ముడి వేయలేనంతగా బంధం తెగిపోయింది. తన ఫోన్ కాల్స్ ట్యాప్ చేస్తున్నారనే విషయాన్ని బహిరంగంగానే చెప్పేసిన కోటంరెడ్డి వైసీపీతో తాడో పేడో తేల్చుకోడానికే డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారు. ఆయన ట్యాపింగ్ వార్తలపై అటు అధిష్టానం కూడా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ఓసారి సీఎం జగన్, ఎమ్మెల్యే కోటంరెడ్డిని వ్యక్తిగతంగా పిలిపించుకుని మాట్లాడినప్పుడే ఈ ట్యాపింగ్ వ్యవహారంపై కోటంరెడ్డికి అనుమానం వచ్చినట్టుంది. రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాలన్నిటినీ జగన్ ఆ భేటీలో బయటపెట్టే సరికి ఏదో జరుగుతుందనే డౌట్ కోటంరెడ్డికి వచ్చిందని అంటున్నారు. ఆ తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డికి వైసీపీ సేవాదళ్ పదవి రావడంతో అప్పటికి ఆ వివాదం సమసిపోయినట్టయింది. కోటంరెడ్డి కుటుంబానికి జగన్ ప్రాధాన్యత ఇచ్చారని, దీంతో కోటంరెడ్డి కూడా ఇక అసంతృప్తిని పక్కనపెడతారని అనుకున్నారు. కానీ ఆయన వైసీపీలో కుదురుకోలేకపోయారు. మంత్రి పదవి విషయంలోనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి పదవులు వచ్చాయి.

 

 

తొలి విడత అనిల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెడ్డికి మంత్రి పదవులిచ్చారు. మలి విడత కేవలం కాకాణి గోవర్దన్ రెడ్డికి పదవులిచ్చారు. కోటంరెడ్డి కూడా పదవి ఆశించి భంగపడ్డారు. కానీ పార్టీలోనే కొనసాగారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి కాస్త ఎదురుగాలి వీస్తుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అయిఉండి కూడా కొన్ని పనుల్ని కోటంరెడ్డి చేయించుకోలేకపోయారని అంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా కూడా పనులు చేయించుకోలేకపోతే ఇక తన పదవికి అర్హత ఏముందని ఆయన భావించారు. అందుకే అధికారులతో పలు సందర్భాల్లో గొడవపడ్డారు. వారిపై ఆరోపణలు కూడా చేశారు. కానీ అధిష్టానం ఈ ఆరోపణల్ని వ్యతిరేకంగా అర్థం చేసుకుంది. ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారనే కోణంలో కోటంరెడ్డినే టార్గెట్ చేసింది. కోటంరెడ్డి దాదాపుగా పార్టీని వీడిపోతున్నారనే వార్తలకు బలం చేకూరుతోంది. ఈరోజంతా నెల్లూరు రూరల్ వైసీపీ కార్యాలయం వద్ద కార్యకర్తలు, మీడియా హడావిడి నడిచింది. కోటంరెడ్డి రూరల్ నాయకులతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి అభిప్రాయాలు సేకరించారు. పార్టీలో అవమానాలు పడ్డామని వారి వద్ద కోటంరెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇంకా అవమానాలు పడాలా అని అనుచరుల వద్ద ఆయన ప్రశ్నించారని సమాచారం.

 

 

Post Midle

ఈ దశలో పార్టీ మారడం ఒక్కటే ఆయన ముందున్న ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. వైసీపీలోనే ఉన్నా కూడా 2024లో ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు తక్కువ. అందుకే కోటంరెడ్డి కీలక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. రాత్రి ఏడు గంటల వరకు కార్యాలయంలోనే ఉన్న ఆయన ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయారు. ఎలాంటి ప్రకటన చేయలేదు. అటు అధిష్టానం కూడా కోటంరెడ్డి వ్యవహారంలో ఏదో ఒకటి తేల్చాయని చూస్తోంది. ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డికి నెల్లూరు రూరల్ వైసీపీ పగ్గాలు అప్పగించే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో నిజమెంతుందో తేలాలి. వ్యాపార రంగంలో ఉన్న గిరిధర్ రెడ్డిని, ఆయన అన్న శ్రీధర్ రెడ్డి రాజకీయాల్లోకి తెచ్చారు. అన్నకు అండగా ఆయన ఉంటున్నారు. రూరల్ వైసీపీ కార్యాలయ ఇన్ చార్జ్ గా ఆయన కొనసాగుతున్నారు. ఇటీవల ఆయనకు పార్టీ కార్యదర్శి పదవి ఇచ్చారు. ఆ తర్వాత సేవాదళ్ అధ్యక్షుడిని చేశారు. ఇప్పుడు ఆయన అన్నవైపు ఉంటారా, లేక జగన్ వైపు ఉంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గిరిధర్ రెడ్డి అన్నబాటలోనే వెళ్తారని ఆయన మనసెరిగినవారు చెబుతున్నారు. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి దేన్నీ ముందుగా అంచనా వేయలేం. ఒకవేళ గిరిధర్ రెడ్డి కాదంటే, ఆనం విజయ్ కుమార్ రెడ్డి అక్కడ వైసీపీకి మరో ఆప్షన్ గా ఉన్నారు. మొత్తమ్మీద కోటంరెడ్డి ఎపిసోడ్ కి ఒకటి లేదా రెండు రోజుల్లో ఫుల్ స్టాప్ పడుతుంది.

 

Tags: Kotam Reddy for Telugu Desam?

Post Midle