తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా లక్షకుంకుమార్చన
తిరుచానూరు ముచ్చట్లు:
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం ఉదయం లక్ష కుంకుమార్చన సేవ వైభవంగా జరిగింది.హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. వివాహితురాలైన మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేర్లతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది. అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని అర్చకులు తెలిపారు.ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆశీనులను చేసి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలను వల్లిస్తూ అమ్మవారిని కుంకుమతో అర్చన చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ సేవలో పాల్గొన్నారు.ఘనంగా అంకురార్పణ :

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో గురువారం సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఇందులో భాగంగా పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తారు.
నవంబరు 10న ధ్వజారోహణంఆలయంలో నవంబరు 10న శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్వజస్థంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.10 నుండి 9.30 గంటల మధ్య ధనుర్ లగ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈవో రమేష్, పాంచరాత్ర ఆగమసలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి, మణికంఠ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Tags: Lakshkumkumarchana in Tiruchanur Shri Padmavati Ammavari Temple
