ఇప్పుడేం చేద్దాం…ఆలోచనలో కొత్తకోట
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన ఆ దంపతులు.. ఇప్పుడు భవిష్యత్ ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న పార్టీకి గుడ్బై చెప్పేశారు. కొత్త కండువా కప్పుకోవాలని చూస్తున్నా.. ఎక్కడో తేడా కొడుతోందట. మునుగోడు ఫలితం తర్వాత కొత్త గూటికి వెళ్తారనేది మరో ప్రచారం. ఇంతకీ ఎవరా దంపతులు? ఎందుకు తికమక పడుతున్నారు?మహబూబ్నగర్ జిల్లా రాజకీయాల్లో టీడీపీ హయాంలో ఓ వెలుగు వెలిగారు కొత్తకోట దయాకర్రెడ్డి, సీతమ్మ దంపతులు. ప్రస్తుతం ఏ పార్టీలో చేరాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు. ఏక కాలంలో అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉన్న ఇరువురూ.. దశాబ్దాలుగా టీడీపీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నారు. టీడీపీ నుంచి బయటకొచ్చారు సరే.. ఏ పార్టీలో చేరబోతారనేదానిపై క్లారిటీ లేదట.దయాకర్రెడ్డి అమరచింత నియోజకవర్గం నుంచి 1994, 1999లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మక్తల్ నుంచి 2009లో ఎమ్మెల్యే అయ్యారు. 2002లో దయాకర్రెడ్డి భార్య సీతమ్మ జడ్పీ ఛైర్పర్సన్గా ఎన్నికయ్యారు. 2009లో దేవరకద్ర నుంచి ఆమె ఎమ్మెల్యే కావడంతో.. ఒకేసారి భార్యాభర్తలిద్దరూ శాసనసభ్యులుగా ఉన్న రికార్డు నెలకొల్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీడీపీ రాష్ట్రంలో ఉనికి కోల్పోతున్న పరిస్థితి. అది రాజకీయంగా తమకూ ప్రతికూల ప్రభావం చూపెడుతోందని ఆందోళన చెందుతున్నారు. కొన్నాళ్లుగా దయాకర్రెడ్డి దంపతులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కాకపోతే ఏపార్టీలోకి వెళ్తారనేది స్పష్టత లేదు.ఏ
పార్టీలోకి వెళ్తే బాగుంటుందో ప్రజలే నిర్ణయించాలని ఆరు నెలల క్రితం మక్తల్, దేవరకద్రలో దయాకర్ దంపతులు పర్యటనలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో టచ్లో ఉన్నట్టు ప్రచారం సాగింది. మాజీ ప్రజాప్రతినిధులు కావడంతో వీరిద్దరినీ పిలిచి కండువా కప్పేస్తారని అనుకున్నా.. ముందుడగు పడలేదు. దానికి దయాకర్రెడ్డి దంపతులు పెడుతున్న షరతులే కారణమని టాక్. రెండు, మూడు అసెంబ్లీ సీట్లపై వీరిద్దరూ పట్టుబడుతున్నారట. వాటిపై హామీ ఇచ్చిన పార్టీలోకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకే చేరికకు బ్రేక్ పడుతోందని అభిప్రాయ పడుతున్నారు.దయాకర్రెడ్డి స్వయంగా మక్తల్ సీటు కోరుతున్నారట. సీతా దయాకర్రెడ్డికి దేవరకద్ర.. తమ కుమారుడికి నారాయణపేట సీటు ఇవ్వాలని షరతు పెడుతున్నట్టు సమాచారం. ఈ మూడు సీట్లలో బీజేపీ, కాంగ్రెస్లో ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. అందుకే ఆ రెండు పార్టీల నుంచి ఎలాంటి హామీ లభించలేదని సమాచారం. ఇక టీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటంతో అక్కడికి వెళ్లినా టికెట్పై గ్యారెంటీ లేదనే అభిప్రాయం ఉన్నారట.దయాకర్రెడ్డి దంపతులు కాంగ్రెస్లోకి వెళ్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

పెబ్బేరు సమీపంలో AICC కార్యదర్శులు బోసు రాజు, చిన్నారెడ్డిలతో వీరిద్దరూ సమావేశమై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే దేవరకద్ర నుంచి కాంగ్రెస్ నేతలు మధుసూధన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, ప్రదీప్గౌడ్, మక్తల్ నుంచి శ్రీహరి, ఆశిరెడ్డిలు వచ్చి.. ఇన్నాళ్లూ పార్టీనే నమ్ముకుని ఉన్న తమ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారట. దీంతో రెండు సీట్లకు బదులు మక్తల్ ఒకటే ఇస్తామనే హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిపాదనకు ఒప్పుకొంటే భారత్ జోడో యాత్రలో భాగంగా రాష్ట్రానికి వస్తున్న రాహుల్ గాంధీ సమక్షంలో దయాకర్రెడ్డి దంపతులు కాంగ్రెస్ కండువా కప్పుకొంటారనే వాదన నడుస్తోంది.ఈ దంపతుల విషయంలో మరో ప్రచారం కూడా సాగుతోంది. మునుగోడు ఉపఎన్నిక ఫలితం ఆధారంగా దయాకర్రెడ్డి దంపతులు రాజకీయ భవిష్యత్పై నిర్ణయం తీసుకుంటారనే టాక్ నడుస్తోంది. అనుచరులకు అదే చెబుతున్నట్టు సమాచారం. మొత్తంమీద టీడీపీ నుంచి బయటకు వచ్చిన దంపతులు ఎటు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారు. పొలిటికల్ చౌరస్తాలో దిక్కుతోచక తికమక పడుతున్నారు.
Tags: Let’s do it now…think Kottakota
