Natyam ad

రఘురామకు లైన్ క్లియర్

ఏలూరు ముచ్చట్లు:


రఘురామ కృష్ణరాజు వచ్చే నెల 4వ తేదీన తన సొంత నియోజకవర్గానికి రావాలని భావిస్తున్నారు. మోదీ పర్యటన సందర్బంగా ఆయన నర్సాపురం నియోజకవర్గంలోని భీమవరానికి రావాలని డిసైడ్ అయ్యారు. ప్రధాని పాల్గొనే కార్యక్రమంలో స్థానిక ఎంపీ పాల్గొనకపోవడం, ప్రొటోకాల్ ను పాటించకపోతే మంచిది కాదని భావిస్తున్నారు. అయితే తాను వస్తే ఏదైనా జరిగితే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని రాజు ఇప్పటికే హెచ్చరించారు. దాదాపు రెండేళ్ల తర్వాత రఘురామ కృష్ణరాజు నరసాపురానికి రావాలనుకుంటున్నారు. అయితే ఆయన వస్తే స్థానిక వైసీపీ నేతలు అడ్డుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రఘురామ కృష్ణరాజు గత రెండేళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన జగన్ పై కూడా వ్యక్తిగతంగా విమర్శలకు దిగుతున్నారు. రచ్చబండ పేరుతో నిత్యం ఢిల్లీలో కూర్చుని రాజు చేస్తున్న వ్యాఖ్యలు సహజంగానే వైసీపీ క్యాడర్ లో మంటలు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే అనేక కేసులు ఆయనపై జిల్లాలో నమోదయి ఉన్నాయి. రఘురామ కృష్ణరాజు వచ్చిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం కూడా సాగుతోంది.. ఒకదశలో రాజీనామా చేస్తానని రఘురామ కృష్ణరాజు డెడ్ లైన్ కూడా పెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే ఆయన రాజీనామా చేయాల్సి ఉంది. కానీ ఎందుకో వెనక్కు తగ్గారు. అందుకు కారణాలు ప్రధానంగా బీజేపీ నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు. మరోవైపు టీడీపీ నుంచి కూడా రాజీనామా వద్దని వారించారు. వైసీపీలోనే ఉండి ఎన్నికల వరకూ ఆ పార్టీని విమర్శిస్తేనే కొంత ప్రయోజనం ఉంటుందని సూచించారు. బయటకు వచ్చి విమర్శలు చేస్తే ప్రజలు కూడా పట్టించుకోరన్న హితోక్తులతో రఘురామ కృష్ణరాజు వెనక్కు తగ్గారని తెలిసింది. వచ్చే ఎన్నికల్లో రఘురామ కృష్ణరాజు కు నరసాపురం టిక్కెట్ కన్ఫర్మ్ అయింది. జనసేనతో పొత్తు ఉన్నా టిక్కెట్ మాత్రం ఆయనకే ఇస్తామన్న హామీ వచ్చింది. నాగబాబు ఇప్పటికే తాను పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించడంతో రఘురామ కృష్ణరాజుకు లైన్ క్లియర్ అయిందంటున్నారు. అందుకే ఆయన రాజీనామా చేయకుండా చివర వరకూ వైసీపీ ఎంపీగానే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. అందుకే రాజీనామా చేయకుండా వైసీపీ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తున్నారు. టీడీపీ ఆఫర్ రాజుగారికి లభించడంతోనే ఆయన మరింత రెచ్చి పోతున్నారన్నది టాక్.

 

Tags: Line clear to Raghurama

Post Midle
Post Midle