సామాన్య భక్తుల కోసం పిఏసి-1 వద్ద ఫుడ్ కౌంటర్ ప్రారంభం
తిరుమల ముచ్చట్లు:
టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు తిరుమలలో సామాన్య భక్తుల సౌకర్యార్థం పిఏసి-1 వద్ద ఆదివారం ఫుడ్ కౌంటర్ ను ప్రారంభించారు.టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ కౌంటరులో ముందుగా శ్రీవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాల పంపిణీని ప్రారంభించారు. ఇక్కడ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తారు. పిఏసి-1లో బస చేసే సామాన్య భక్తులకు ఈ ఫుడ్ కౌంటర్ సౌకర్యవంతంగా ఉంటుంది.తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు పాత అన్నదానం కాంప్లెక్స్, పిఏసి-2లో అన్నప్రసాద వితరణ జరుగుతోంది. వీటితోపాటు రాంభగీచా బస్టాండ్, కేంద్రీయ విచారణ కార్యాలయం వద్ద ఫుడ్ కౌంటర్లు ఉన్నాయి. దీంతో కలిపి మొత్తం ఫుడ్ కౌంటర్లు మూడుకు చేరాయి.ఈ కార్యక్రమంలో రిసెప్షన్ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి, ఈఈ సురేంద్రనాథ్ రెడ్డి, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి, ఏఈఓ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Opening of food counter at PAC-1 for common devotees
