అన్యమత ప్రచారం…
పొరపాటున జరిగిందన్న పోలీస్ శాఖ
విశాఖపట్టణం ముచ్చట్లు:
విశాఖలో ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన రశీదుపై అన్యమత కీర్తనలు ఉండటంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ వివాదంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని క్లారిటీ ఇచ్చారు. విశాఖ రైల్వేస్టేషన్లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే ఆటోస్టాండ్లో ప్యాసింజర్స్కి ఇచ్చే టోకెన్లపై మతపరమైన కీర్తనలు ఉండటం వివాదానికి తెరలేపింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దాంతో విశాఖ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. బీజేపీ నేతలు ట్రాఫిక్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వ్యవహారమంతా పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతోందని బీజేపీ నాయకుడు భానుప్రకాష్రెడ్డి ఆరోపిస్తున్నారు. అసలు సూత్రధారులు, పాత్రధారులను ప్రజల ముందు నిలబెట్టాలని తిరుపతిలో డిమాండ్ చేశారాయన.

ఈ ఘటనపై పెద్దయెత్తున విమర్శలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆటోస్టాండ్లో ప్రయాణికులకు ఇచ్చే టోకెన్లు అయిపోవడంతో గమనించకుండా పొరపాటున వేరే టోకెన్లు ఇవ్వడం జరిగిందని పోలీస్శాఖ తెలిపింది. కొత్త టోకెన్లు తీసుకురావాలని ప్రీపెయిడ్ ఆటో సెక్రటరీకి అక్కడి సిబ్బంది చెప్పడంతో.. అతడు బైబిల్ వాక్యాలతో కూడిన టోకెన్లను తీసుకువచ్చారని చెప్పింది. అయితే అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది అది గమనించకుండాలనే ప్రయాణికులకు టోకెన్లు ఇచ్చారని వివరణ ఇచ్చారు. ఇదంతా పొరపాటుగా జరిగిందని .. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని స్పష్టం చేసింది.ఇదే విషయంపై సోషల్ మీడియా వేదికగా విశాఖ పోలీసు శాఖ వివరణ ఇచ్చింది. పలువురు నెటిజన్లకు సమాధానమిచ్చిన సిటీ పోలీసులు..ఓ ఆటోడ్రైవర్ తన అజ్ఞానంతో హెడ్ కానిస్టేబుల్కు అందజేసిన స్లిప్పులను అత్యవసర పరిస్థితుల్లో పంపిణీ చేశాడని వెల్లడించింది. వెంటనే వాటిని నిలిపివేశామని వివరణ ఇచ్చింది.
Tags: Pagan propaganda…
