శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా పత్ర పుష్పయాగం
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో శుక్రవారం పత్రపుష్పయాగం వైభవంగా జరిగింది.ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, అభిషేకం నిర్వహించారు. ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారు, శ్రీ కామక్షి అమ్మవారి ఉత్సవర్లకు నవ కలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పంచామృతాభిషేకం, చెరుకు రసం, కొబ్బరినీళ్ళు, విబూది, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పత్ర పుష్పయాగ మహోత్సవం జరిగింది. ఇందులో చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, జాజి, రోజా, తామర, మల్లి, వృక్షి, కనకాంబరంలతో పాటు బిల్వ పత్రం, తులసి, పన్నీరు ఆకులతో స్వామి, అమ్మవార్లకు పత్ర పుష్ప యాగం నిర్వహించారు.ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల నుండి దాతలు 3 టన్నులు పుష్పాలు, పత్రాలు విరాళంగా అందించారు. ఇందులో 12 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలు ఉన్నాయి.ఆలయంలో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పత్ర పుష్పయాగం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో పార్థసారథి, సూపరింటెండెంట్ భూపతి పాల్గొన్నారు.

Tags:Patra Puspayagam in splendor at Sri Kapileshwaralayam
