ముగిసిన రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్
న్యూఢిల్లీ ముచ్చట్లు:
రాష్ట్రపతి ఎన్నికల్లో అతి కీలకమైన పోలింగ్ ప్రక్రియ సోమవారం ముగిసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా ఇవాళే ప్రారంభం కావడంతో ఎంపీలందరూ ఢిల్లీలో, ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలు అసెంబ్లీల్లో ఓట్లు వేస్తున్నారు. పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానితోపాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు క్యూలైన్లలో నిలబడి ఓట్లు వేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయడానికి ముందు.. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. కొత్త రాష్ట్రపతి, కొత్త ఉపరాష్ట్రపతి దేశానికి మార్గనిర్దేశం చేయడం ప్రారంభించే ఈ ప్రస్తుత ప్రక్రియ ఎంతో కీలకమైందన్నారు. ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాలం కూడా అని ప్రధాని గుర్తు చేశారు.ప్రతి ఒక్కరి పార్లమెంటులో ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటారని, ఈ సమావేశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని పార్లమెంటు సభ్యులను ప్రధాని మోడీ కోరారు. “ఈ సెషన్ కూడా ముఖ్యమైనది. ఎందుకంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ కాలంలో, కొత్త రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి దేశానికి మార్గనిర్దేశం చేయడం ప్రారంభిస్తారు” అని ఆయన అన్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవుతాయి. ప్రభుత్వ కార్యకలాపాల అవసరాలకు లోబడి ఆగస్టు 12న ముగుస్తాయి. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల సంఘం.. పార్లమెంట్ భవనంలోని రూమ్ 63లో మొత్తం ఆరు బూత్ ను ఏర్పాటు చేసింది. సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లకు వేర్వేరు విలువ ఉంటుంది కాబట్టి, ఎంపీలకు ఆకుపచ్చ రంగు, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలను అందించారు.మొత్తం 4809 మంది ఎలక్టరోరల్ కాలేజి సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అందులో 776 మంది ఎంపీలు, 4033 మంది ఎమ్మెల్యేలున్నారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా మధ్య పోరు జరుగుతుండగా, ఇప్పటికే ఆయా పార్టీలు ప్రకటించిన మద్దతులను బట్టి ద్రౌపది ముర్ము విజయం ఖాయం.
బహిష్కరించిన ఆకాలీదళ్
రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్లో అకాలీదళ్ ఎమ్మెల్యే మన్ప్రీత్ సింగ్ అయ్యాలీ పాల్గొనలేదు. ఆ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ఆయన తన ఫేస్బుక్లో ఓ వీడియో ద్వారా తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థి ముర్ము లేదా విపక్ష అభ్యర్థి యశ్వంత్కు ఓటు వేయడం లేదని ఆయన ఆ వీడియోలో వెల్లడించారు. 1984లో జరిగిన సిక్కుల ఊచకోతకు కాంగ్రెస్ కారణమని, అందుకే ఆ పార్టీకి ఓటు వేయడం లేదని అన్నారు. పంజాబ్ సమస్యల్ని కాంగ్రెస్ పరిష్కరించలేదన్నారు. అధికారంలో ఉన్న బీజేపీ కూడా పంజాబ్ సమస్యల్ని పట్టించుకోలేదని, ఎందుకు అలా జరిగిందో తెలియదన్నారు. ద్రౌపది ముర్ము నామినేషన్కు ముందు సిక్కు వర్గీయులను ఎవరూ కలవలేదని ఆయన అన్నారు. అయితే ఈ ఎన్నికల్లో అకాలీదళ్ పార్టీ ముర్ముకు మద్దతు పలికిన విషయం తెలిసిందే. అకాలీదళ్ పార్టీ తరపున పంజాబ్ అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీకి లోక్సభలో ఇద్దరు ఎంపీలు ఉన్నారు.
వీల్ చైర్ లో వచ్చి ఓటేసిన మన్మోహన్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా పార్లమెంట్కు వచ్చి ఓటేశారు. అయితే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించినట్లు తెలుస్తోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు మన్మోహన్ వీల్చైర్లో వచ్చారు. పార్లమెంట్లో ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సులో ఆయన ఓటేశారు. వ్యక్తిగత సిబ్బంది సహకారం తీసుకుని ఎంపీ మన్మోహన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ పోటీపడుతున్న విషయం తెలిసిందే.
Tags: Polling for the presidential election is over