ఫిబ్రవరి 8న టిటిడి స్థానికాలయాల్లో ఏకాంతంగా రథసప్తమి
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని టిటిడి స్థానికాలయాల్లో ఫిబ్రవరి 8వ తేదీ మంగళవారం రథసప్తమి పర్వదినం ఏకాంతంగా జరుగనుంది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో టిటిడి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామాలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో రథసప్తమి పర్వదినం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమినాడు సూర్యజయంతిని పురస్కరించుకొని టిటిడి స్థానిక ఆలయాల్లో రథసప్తమి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ.తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వాహనమండపంలో ఏకాంతంగా వాహనసేవలు నిర్వహిస్తారు. ఉదయం 7 గం||ల నుంచి 7.30 గం||ల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 8 గం||ల నుంచి 8.30 గం||ల వరకు హంస వాహనం, ఉదయం 9 గం||ల నుంచి 9.30 గం||ల వరకు అశ్వ వాహనం, ఉదయం 9.30 గం||ల నుంచి 10.00 గం||ల వరకు గరుడ వాహనం, ఉదయం 10 గం||ల నుంచి 10.30 గం||ల వరకు చిన్నశేష వాహనసేవ జరుగనున్నాయి. అదేవిధంగా, మధ్యాహ్నం 3 గం||ల నుంచి 4.30 గం||ల వరకు (శ్రీకృష్ణ ముఖ మండపంలో) స్నపనతిరుమంజనం, సాయంత్రం 6.00 గం||ల నుంచి 6.30 గం||ల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 7.30 గం||ల నుంచి 8 గం||ల వరకు గజ వాహనసేవ నిర్వహిస్తారు.
అదేవిధంగా, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామివారిని అశ్వవాహనంపై వేంచేపు చేసి ఆస్థానం నిర్వహిస్తారు.తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లు సప్తవాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. ఉదయం 6 గంటలకు సూర్యప్రభ వాహనంతో శ్రీ గోవిందరాజస్వామివారి వాహన సేవలు ప్రారంభమవుతాయి. రాత్రి 8 గంటల వరకు హంస, హనుమంత, పెద్దశేష, ముత్యపుపందిరి, సర్వభూపాల, గరుడవాహన సేవలు నిర్వహిస్తారు.తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉదయం 7 గంటలకు సూర్యప్రభవాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవలు జరుగనున్నాయి.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తిరుచ్చిపై వేంచేపు చేసి ఆస్థానం నిర్వహిస్తారు.అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తిరుచ్చిపై వేంచేపు చేసి ఆస్థానం చేపడతారు.
Tags: Rathsaptami in solitude in TTD localities on February 8th