26న పర్వతగిరి శివాలయం పునః ప్రతిష్టాపన –
వరంగల్ ముచ్చట్లు:
కాకతీయుల కాలంలో నిర్మించి, 700 సంవత్సరాల చారిత్రక ప్రాశస్త్యం కలిగిన పర్వతగిరి శివాలయ పునః ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీన నిర్వహించబోతున్నారు. అయితే ఆరోజు నుంచి మూడ్రోజుల పాటు(26, ,27,28వ తేదీల్లో) అత్యంత వైభవంగా జాతర నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు స్థానిక వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ కూడా ఉన్నారు. దాదాపు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆలయ పునః ప్రతిష్టాపన చేస్తున్నామని, దీనికి చుట్టుపక్కల ఉన్న గ్రామస్థులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి ఇంటి నుంచి తెచ్చిన జలంతో శివుడికి అభిషేకం చేయాలని కోరారు.ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పునః ప్రతిష్టాపన కార్యక్రమంపై మంత్రి ,ఎమ్మెల్యే జిల్లా శాఖ అధికారులతో శివాలయం వద్ద సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందు పర్వతాల శివాలయానికి నూతనంగా ఏర్పాటు చేసిన దాదాపు 700 మెట్లను ఎక్కి పరిసర ప్రాంతాలను, భక్తుల వసతులను మంత్రి స్వయంగా పర్యవేక్షించారు.
అనంతరం ఎలక్ట్రిసిటీ లైన్స్ కు శంకుస్థాపన చేశారు. అన్ని సౌకర్యాలు కల్పించాలని అదేశాలు జారీ చేశారు. శివాలయానికి మూడు రోజుల్లో, వేలు, లక్షల్లో భక్తులు వస్తారని, శివాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.పర్వతగిరి రిజర్వాయర్ ను లోయర్ మానేర్ డ్యాంను జాతర నాటికి నీటితో నింపాలని దేవాదుల చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డిని మంత్రి ఆదేశించారు. రిజర్వాయర్ లో భక్తుల ఆహ్లాదం కోసం బోటింగ్ ఏర్పాటు చేయాలని టూరిజం శాఖ అధికారులను కోరారు. మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్న నేపథ్యంలో వారి ఆరోగ్య పరిరక్షణ కోసం తగినన్ని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. పర్వతాల శివాలయం జాతరకు వచ్చే భక్తుల కోసం పర్వతగిరి నుంచి గుట్ట వరకు తగినని బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

Tags; Re-inauguration of Parvatgiri Shiva Temple on 26th –
