శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
– మే 4 నుండి 6వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు
తిరుపతి ముచ్చట్లు:

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుధ్ధి నిర్వహించారు.అనంతరం ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు మే 4 నుండి 6వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందుకోసం మే 3వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు.ఈ ఉత్సవాల్లో భాగంగా మే 4 నుండి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేపడతారు. అలాగే రాత్రి 7 .30 నుండి 8.30 గంటల వరకు అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మే 5వ తేదీ ఉదయం 9.10 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది.
ఈ ఉత్సవాల కారణంగా మే 2 నుండి 6వ తేదీ వరకు కల్యాణోత్సవం, సహస్రదీపాలంకారసేవ, మే 3న అష్టోత్తర శతకలశాభిషేకం, మే 5న లక్ష్మి పూజ ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది.
ఆలయానికి పరదాలు విరాళం :
హైదరాబాదుకు చెందిన స్వర్ణ కుమార్ రెడ్డి 12 పరదాలు విరాళంగా అందించారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుభాష్ పాల్గొన్నారు.
Tags:Sastroktanga Koil Alwar Thirumanjanam in Sri Padmavati Ammavari Temple
