దేశ విమానయాన పటంలో చేరిన సిక్కిం

Sikkim joins the country's aviation map
Date:24/09/2018
తొలి ఎయిర్పోర్ట్ను ప్రారంబించిన ప్రధాన మంత్రి మోదీ
పాక్యాంగ్ ముచ్చట్లు:
ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలోని పాక్యాంగ్లో నిర్మించిన విమానాశ్రయాన్ని సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సిక్కింలో ఇదే తొలి ఎయిర్పోర్ట్ కావడం విశేషం. భారత్లోని రాష్ట్రాల్లో సిక్కింలో మాత్రమే ఇప్పటిదాకా విమానాశ్రయం లేదు. పాక్యాంగ్ విమానాశ్రయ ప్రారంభంతో సిక్కిం కూడా దేశ విమానయాన పటంలో చేరింది. హిమాలయ రాష్ట్రమైన సిక్కింలో పర్వతాలను తొలిచి అనేక సంక్లిష్టతల నడుమ విజయవంతంగా ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తిచేశారు.
దీని ప్రారంభంతో రాష్ట్రానికి ఇతర ప్రాంతాలతో అనుసంధానం పెరగడమే కాకుండా పర్యాటక రంగం అభివృద్ధి చెందే అవకాశాలు మెరుగుపడతాయి. అక్టోబరు 4వ తేదీ నుంచి పాక్యాంగ్ నుంచి వాణిజ్య విమానాలు నడవనున్నాయి. స్పైస్జెట్ కోల్కతా నుంచి సిక్కింకు రోజువారీ విమానం నడపనుంది.ఈ విమానాశ్రయ నిర్మాణానికి తొమ్మిదేళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. 201ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.605కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు.
పాక్యాంగ్ గ్రామానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో పర్వత ప్రాంతంలో ఇది ఉంటుంది. ఇది దేశంలో వందో విమానాశ్రయం కావడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సిక్కిం చేరుకుని నేడు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్, విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభుతో పాటు పలువురు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ విమానాశ్రయాన్ని సిక్కిం ప్రజలకు అంకితమిస్తున్నానని, ఇది దేశంలో వందో ఆపరేషనల్ ఎయిర్పోర్ట్ అని మోదీ తెలిపారు.
దేశానికి ఇది శతకం అని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఈ విమానాశ్రయం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మోదీ మాట్లాడుతుంటే ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. సిక్కిం ప్రజలకు ప్రధాని మోదీ ఇస్తున్న కానుక ఇది అని, మరో పది నుంచి పదిహేనేళ్లలో దేశంలో మరో వంద విమానాశ్రయాలు నిర్మిస్తామని ప్రభు అన్నారు. పాక్యాంగ్ విమానాశ్రయ ప్రారంభం చారిత్రక ఘట్టమని పవన్ చామ్లింగ్ పేర్కొన్నారు.
Tags:Sikkim joins the country’s aviation map