కాంగ్రెస్ లో పదవుల కీచులాట
నల్గోండ ముచ్చట్లు:
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి మధ్య గ్యాప్ ఉందనేది కాంగ్రెస్ వర్గాల్లో ఓపెన్ టాక్. తాజాగా ప్రకటించిన పీసీసీ పదవుల పంపకంలోనూ ఆ ఆధిపత్యపోరు నడిచిందిని చెబుతున్నారు. ఎవరికి కావాల్సిన పదవులు వాళ్లు తీసుకున్నారనే విమర్శ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఎవరి లెక్కలు వాళ్లకు ఉన్నాయని కామెంట్ చేయడం కూడా ఆ చర్చకు బలాన్ని ఇస్తోందట. పీసీసీ కార్యవర్గం కూర్పునకు కసరత్తు మొదలైనప్పుడే కమిటీలో పైచెయ్యి సాధించాలని రేవంత్.. ఆయన్ని కట్టడి చేయాలని మరికొందరు నాయకులు పావులు కదిపారు. పైనల్గా ఎవరి జాబితాలను వాళ్లు హైకమాండ్కు అందజేశారు. కానీ.. అధిష్ఠానం ఎవరినీ పూర్తిగా సంతృప్తి పరిచిన పరిస్థితి లేదు. దాంతో టీ కాంగ్రెస్లో ఓ రేంజ్లో ప్రకంపనలు కనిపిస్తున్నాయి.గ్రేటర్ హైదరాబాద్ను సంస్థాగతంగా మూడు జిల్లాలుగా విభజించింది కాంగ్రెస్ పార్టీ. వాటిలో హైదరాబాద్, ఖైరతాబాద్ జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు. సికింద్రాబాద్ DCCపై నిర్ణయం వాయిదా పడింది. రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి మధ్య పోటీ వల్లే బ్రేక్ పడిందనే చర్చ నడుస్తోంది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్కు సికింద్రాబాద్ బాధ్యతలు ఇవ్వాలని చూస్తున్నారు రేవంత్. అయితే పార్టీ సీనియర్ నేత ఆడం సంతోష్కు సికింద్రాబాద్ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉత్తమ్ పావులు కదుపుతున్నారని రేవంత్ వర్గం చర్చకు పెట్టింది.
సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష నియామకాన్ని కూడా హైకమాండ్ వాయిదా వేసింది. సికింద్రాబాద్ అధ్యక్ష ఎన్నికల్లో ఉత్తమ్ జోక్యం చేసుకోవడం వల్లే సూర్యాపేట డీసీసీని రేవంత్ ఆపారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సూర్యాపేటకు చెందిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి.. మునుగోడు ఉపఎన్నికలో రేవంత్కు పూర్తిగా అనుకూలంగా పనిచేశారు. కానీ.. సూర్యాపేట డీసీసీ విషయంలో రేవంత్ తనకు సహకరించడం లేదనే అభిప్రాయంలో ఉన్నారు దామోదర్రెడ్డి. ఉత్తమ్, రేవంత్ల మధ్య పంచాయితీ వల్లే సూర్యాపేట డీసీసీని పెండింగ్లో పెట్టారనే ఫీలింగ్లోనూ మాజీ మంత్రి ఉన్నారనే ప్రచారం నడుస్తోంది. ఇలా పార్టీలో పదవుల పంపకం తీవ్ర దుమారం రేపుతోంది.పీసీసీ కమిటీల విషయంలో ఎవరి ఎత్తుగడలు ఏంటో కానీ.. కాంగ్రెస్లో రేవంత్, ఉత్తమ్ మధ్య కోల్డ్వార్ నడుస్తోందనే టాపిక్ విస్తృతంగా ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఉత్తమ్ పూర్తిస్థాయిలో నియోజకవర్గానికి పరిమితం అయ్యారు. తన పార్లమెంట్ లేదంటే హుజూర్నగర్ అసెంబ్లీపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అయితే పీసీసీ కమిటీల ప్రక్రియ మొదలైనప్పటి నుంచీ హస్తినలో ఇద్దరూ పావులు కదిపారనేది ఓపెస్ సీక్రెట్. ఆసక్తికర విషయం ఏంటంటే.. పీసీసీలో ఉత్తమ్ సతీమణి పద్మావతికి ఉపాధ్యక్ష పదవి దక్కింది. ఆ విషయం ఉత్తమ్కు కూడా తెలియదని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. మొత్తానికి పీసీసీ కమిటీలలో ఎన్నో చిత్ర విచిత్రాలు జరగడంతో కాంగ్రెస్లో రేగిన దుమారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.

Tags: Squealing of posts in Congress
