అన్నదాతలకు రూ”5 కే భోజనం అమలుకు రాష్ట్ర ప్రభుత్వ యోజన
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో రైతులకు రూ.5కే భోజన సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలో ఖరారు చేయనుంది. రాష్ట్రంలో 192 ప్రధాన మార్కెట్ యార్డులు, 87 ఉప యార్డులున్నాయి. వీటన్నింటికీ కలిపి సీజన్ సమయంలో రోజూ 8 వేల నుంచి 10 వేల మంది వస్తుంటారు. మార్కెట్ యార్డుల్లో ప్రస్తుతం భోజన సౌకర్యాలు లేవు. ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను తీసుకొచ్చే రైతులు రోజంతా యార్డులోనే ఉంటారు. ఒక్కోసారి రాత్రిపూట సైతం అక్కడే ఉండాల్సి వస్తుంది. సమీపంలో ఉన్న క్యాంటీన్లు, హోటళ్లకు వెళ్లి భోజనాలు చేస్తారు. అధిక శాతం యార్డుల్లో మంచినీటి వసతి కూడా లేదు. ఈ నేపథ్యంలో రైతులకు రాయితీపై భోజన సౌకర్యం కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్నపూర్ణ పథకం ద్వారా నగరాలు, పట్టణాలు, ఆసుపత్రుల్లో సహాయకుల కోసం రూ.5కి భోజనం అందిస్తున్నారు. ఒక్కో భోజనానికి ప్రభుత్వం రూ.21 రాయితీ చెల్లిస్తోంది. ఈ పథకాన్ని మార్కెట్ యార్డులకూ విస్తరించాలని భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 10 వేల మంది రైతులకు భోజన సౌకర్యం కల్పించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 36 రైతుబజార్లు ఉన్నాయి. వీటికి వేయి మందికి పైగా రైతులు కూరగాయలు తెస్తున్నారు. రైతుబజార్లలోనూ భోజన వసతుల్లేవు. అక్కడా రూ.5కి భోజన సౌకర్యం కల్పించనున్నారు.

Tags;State government scheme to implement Rs 5 k meal for rice donors
